తండ్రి కొడుకు మధ్య క్లాష్ లేనట్లే

జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ నటించిన సిగ్మా సినిమాలో ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.

Update: 2026-07-15 08:35 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ హీరోగా నటించిన జననాయగన్‌ సినిమా గత ఏడాది నుంచి విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గత తమిళనాడు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వల్ల సినిమా విడుదల కాలేదు అని మేకర్స్‌ చెబుతూ వచ్చారు. సెన్సార్‌ విషయంలో జన నాయగన్‌కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పైగా విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ కారణంగా సినిమా విడుదల విషయమై పెద్ద రాద్దాంతం జరిగింది. ఈ సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేయాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు విజయ్ సీఎం కావడంతో జన నాయగన్‌కి లైన్ క్లీయర్ అయింది. ఇటీవల ఈ సినిమాకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయిన విషయం తెల్సిందే. సెన్సార్‌ పూర్తి అయిన వెంటనే సినిమాను జులై 23న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే రిలీజ్‌కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

విజయ్‌ జన నాయగన్‌ సినిమా రిలీజ్‌...

విజయ్‌ జన నాయగన్‌ సినిమాతో పాటు, ఆయన కొడుకు జేసన్ సంజయ్‌ దర్శకత్వంలో రూపొందిన 'సిగ్మా' విడుదలకు రెడీ అయింది. చాలా రోజుల క్రితమే సిగ్మా సినిమాను జులై 23న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు జన నాయగన్‌ సినిమాను అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో తండ్రి, కొడుకు సినిమాల మధ్య బిగ్‌ క్లాష్ తప్పదని అంతా భావించారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయనే వార్తలు వచ్చాయి. జన నాయగన్‌ సినిమా మేకర్స్ ఇటీవల సిగ్మా నిర్మాతలతో చర్చలు జరిపి విడుదల వాయిదా వేయించారని తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంకు సిగ్మా సినిమా వాయిదా వేసినట్లుగా కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.

జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సిగ్మా...

జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ నటించిన సిగ్మా సినిమాలో ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. సినిమా నుంచి వచ్చిన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కేవలం తమిళ్‌ల ఓమాత్రమే కాకుండా, తెలుగు ఇంకా ఇతర సౌత్‌ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాల్లో ఫిల్మ్‌ డైరెక్షన్‌ కోర్స్ చేసిన జేసన్‌ సంజయ్ ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, కొన్ని ప్రాజెక్ట్‌లకు అసోషియేట్‌గా వర్క్‌ చేయడం జరిగింది. దర్శకుడిగా పూర్తి స్థాయిలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న జేసన్‌ కి తండ్రి రూపంలో పెద్ద పోటీ అనుకుంటూ ఉండగా, సిగ్మా సినిమాను రెండు మూడు వారాల పాటు వాయిదా వేయడం ద్వారా పెద్ద పోటీ తప్పినట్లు అయిందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

విజయ్‌ వర్సెస్‌ జేసన్‌ సంజయ్‌...

ఇక విజయ్‌ జన నాయగన్‌ సినిమా విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభం నుంచి జాతీయ మీడియా నుంచి గల్లీ మీడియా వరకు ఈ సినిమా గురించి చర్చిస్తున్న విషయం తెల్సిందే. స్టాలిన్‌ ప్రభుత్వం కావాలని సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంది అని చాలా మంది బాహాటంగానే విమర్శించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కారణంగానే జన నాయగన్‌ ఆలస్యం అయింది. విజయ్‌ కెరీర్‌లో చివరి మూవీగా ఈ సినిమాను చెప్పుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో వచ్చిన భగవంత్‌ కేసరి సినిమాకు ఇది అనధికారిక రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు తమిళ నేటివిటీకి చాలా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించాడు అంటున్నారు. విజయ్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది, విజయ్‌ కి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే, పైగా ఈ సినిమా విజయ్‌కి చివరి సినిమా.. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయో ఊహకు సైతం అండం లేదని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News