వెంకీ-త్రివిక్రమ్ మూవీ... రెండు అప్డేట్స్
ఆగస్టు 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.;
వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, వాసు, మళ్లీశ్వరి సినిమాలకు రచయితగా చేసిన త్రివిక్రమ్ 2002లో నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి వెంకటేష్తో ఒక సినిమాను త్రివిక్రమ్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. సినిమా సినిమాకు త్రివిక్రమ్ స్థాయి పెరుగుతూ పోయింది. ఆయనతో యంగ్ స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. దాంతో ఆయన వెంకటేష్తో సినిమాను చేసేందుకు వీలు పడలేదు. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో వీరిద్దరి కాంబో గురించి వార్తలు వస్తూ ఉండేవి. కానీ రెండు దశాబ్దాలుగా వీరి కాంబో మూవీ అందరి ద్రాక్ష అయింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.
గత ఏడాది త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో అల్లు అర్జున్తో తీయాలి అనుకున్న భారీ పీరియాడిక్ డ్రామా మూవీ అటకెక్కింది. అల్లు అర్జున్ మూవీ క్యాన్సల్ కావడంతో రామ్ చరణ్తో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్తో కాకుండా వెంకటేష్తో త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు. ఈ సినిమా గురించి గత వారం పది రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరింది. షూటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. సినిమాను చాలా స్పీడ్గా పూర్తి చేసి 2026 సమ్మర్లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ తో అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ చేయబోతున్న సినిమా ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లభించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా కన్ఫర్మ్ అయిందని, అధికారిక ప్రకటన వెలువడబోతుందని వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ గత కొన్నాళ్లుగా చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాలే కాగా, ఈ సినిమా మీడియం బడ్జెట్తో రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నాగ వంశీ నిర్మించబోతున్నాడు. హాసిని హారిక బ్యానర్లో త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమాను కూడా అదే బ్యానర్లో చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు బ్యానర్ల కలయికలో ఖచ్చితంగా భారీ ఫ్యామిలీ డ్రామా మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 1న ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు అప్డేట్స్ సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.