గ్యాప్ వ‌చ్చిందా..తీసుకుంటున్నారా?

ఏ రంగంలో చూసుకున్నా స‌క్సెస్‌కు ప్రాధాన్య‌త ఇస్తుంటాం. రాజ‌కీయాల్లోకి వ‌స్తే గెల‌పు గుర్రాల‌కే పెద్ద పీట వేస్తుంటారు అన్న‌ది తెలిసిందే.;

Update: 2026-02-13 16:30 GMT

ఏ రంగంలో చూసుకున్నా స‌క్సెస్‌కు ప్రాధాన్య‌త ఇస్తుంటాం. రాజ‌కీయాల్లోకి వ‌స్తే గెల‌పు గుర్రాల‌కే పెద్ద పీట వేస్తుంటారు అన్న‌ది తెలిసిందే. అయితే సినిమా రంగంలో మాత్రం స‌క్సెస్‌కే ప్రియారిటీ. ఎన్ని చేసినా.. ఎలాంటి స్టార్స్ అయినా.. లేదా బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన డైరెక్ట‌ర్స్ అయినా ఇక్క‌డ స‌క్సెస్ ఉండాల్సిందే. అది లేకుంటే వారిని ప‌ట్టించుకునే వారు ఉండ‌రు. ఒక ద‌శ‌లో సూప‌ర్ హిట్‌లు ఇచ్చిన వారు ఫ్లాపులు ఇవ్వ‌డంతో వారంతా తెర‌వెన‌క్కు వెళ్ల‌డ‌మో..త‌మ టైమ్ వ‌చ్చే వ‌ర‌కు సైలెంట్‌గా ఉండ‌ట‌మో చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొంత మంది డైరెక్ట‌ర్లు ఇదే పంథాని ఫాలో అవుతున్నారు.

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కూడా కొంత మంది డైరెక్ట‌ర్ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఒక ద‌శ‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తూ స్టార్‌ల‌తో సినిమాలు చేసిన డైరెక్ట‌ర్లు గ‌త కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. లైమ్ లైట్‌లో క‌నిపించ‌డం లేదు. దానికి ప్ర‌ధాన కార‌ణం వారి ట్రాక్ రికార్డ్. వ‌రుస‌గా ఫ్లాపులు ఇవ్వ‌డంతో స్టార్ డైరెక్ట‌ర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా కొన్ని నెల‌ల‌గా సైలెంట్ అయిపోయి గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ జాబితాలో సురేంద‌ర్‌రెడ్డి, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, వంశీ పైడిప‌ల్లి, శ్రీ‌ను వైట్ల‌, శ్రీ‌కాంత్ అడ్డాల‌, రాధాకృష్ణ‌కుమార్ వంటి ద‌ర్శ‌కులు ఉన్నారు.

మూడేళ్ల విరామం త‌రువాత..

వీరిలో సురేంద‌ర్‌రెడ్డి ఏజెంట్‌ డిజాస్ట‌ర్ త‌రువాత ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయాడు. మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుడుతున్నాడు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా, వ‌క్కంతం వంశీ క‌థ స‌హ‌కారం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సురేంద‌ర్‌రెడ్డి భ‌విత‌వ్యాన్ని డిసైడ్ చేయ‌బోతోంది. వంశీ పైడిప‌ల్లిదీ ఇదే ప‌రిస్థితి. ప్ర‌భాస్ , ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, నాగార్జున‌, కార్తి, మ‌హేష్‌, విజ‌య్ వంటి క్రేజీ స్టార్ల‌తో భారీ సినిమాలు చేశారు.

అయితే 2023, జ‌న‌వ‌రి 11న విడుద‌లైన వార‌సుడు త‌రువాత సైలెంట్ అయిపోయారు. స‌ల్మాన్‌ఖాన్‌తో బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా దానికి సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. మిగ‌తా స్టార్స్‌ల‌లో ఎవ‌రైనా డేట్స్ ఇస్తారా? అంటే ఎవ‌రు కూడా ఖాళీగా లేరు. దీంతో వంశీ పైడిప‌ల్లి ఈ ఏడాదైనా సినిమా చేస్తారా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇక క్రిష్ జాగర్ల‌మూడిది మ‌రో ప‌రిస్థితి. గ‌మ్యం నుంచి కంచె వ‌ర‌కు సాఫీగా సాగిన ఈయ‌న‌ ప్ర‌యాణం ఆ త‌రువాత నుంచే గాడి త‌ప్పింది.

మ‌ణిక‌ర్ణిక టైమ్‌లో కంగ‌న‌తో...

మ‌ణిక‌ర్ణిక టైమ్‌లో కంగ‌న‌తో వివాదం, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విష‌యంలోనూ క్రిష్‌కు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. శ్ర‌మించి ప‌ని చేసినా రిలీజ్ టైమ్‌లో మాత్రం క్రిష్‌కు క్రెడిట్ ద‌క్క‌లేదు. అనుష్క‌తో ఘాటి చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో బిగ్ క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ట్రెక్కింగ్ నేప‌థ్యంలో ఓ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇందులో మొత్తం ఏడుగురు క్రేజీ హీరోయిన్‌లు న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. వ‌రుస‌గా క్రేజీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీ‌ను వైట్ల గ‌త కొంత కాలంగా రేసులో వెన‌క‌బ‌డిపోయారు. త్వ‌ర‌లో శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌బోతున్నారు. దీంతో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వాన్ని ద‌క్కించుకుంటారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

కొత్త బంగారు లోకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ముకుంద సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీ‌కాంత్ అడ్డాల‌. అయితే మ‌హేష్‌తో చేసిన బ్ర‌హ్మోత్స‌వం ఆయ‌న ట్రాక్ త‌ప్పేలా చేసింది. త‌మిళ రీమేక్ ఆధారంగా చేసిన నార‌ప్ప‌ స‌క్సెస్ అనిపించుకున్నా కానీ అది థియేట‌ర్ల‌లో రిలీజ్ కాక‌పోవ‌డం, ఆ త‌రువాత చేసిన పెద‌కాపు -1 డిజాస్ట‌ర్ కావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల సైలెంట్ అయిపోయాడు. దాన‌య్య వార‌సుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న దానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్ లేదు. ప్ర‌భాస్ క్యాంప్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్‌ది కూడా ఇదే ప‌నిస్థితి. ప్ర‌యాణం, సాహ‌సం సినిమాల‌కు డైలాగ్స్ అందించిన ఈయ‌న జిల్‌`తో డైరెక్ట‌ర్ అయ్యారు. రెండవ ప్ర‌య‌త్న‌మే ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్‌ చేశారు. బ‌ట్ నో యూజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నుంచి మ‌రో సినిమా అప్‌డేట్ లేదు.

Tags:    

Similar News