సెకండాఫ్లో టాప్ -5 టాలీవుడ్ సినిమాలు.. రిజల్ట్ ఎవరి పక్షం?
వైవిధ్యమైన కథాంశాలతో విభిన్న కాస్టింగ్ - క్రూ కలయికలో వస్తున్న ఈ చిత్రాలలో ఏ సినిమా కంటెంట్ బెస్ట్గా నిలిచి, బాక్సాఫీస్ విజయాన్ని అందుకోబోతుందనే ఆసక్తికరమైన చర్చ పరిశ్రమ వర్గాల్లో నడుస్తోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 ఫస్టాఫ్ ముగిసి, ఇప్పుడు సెకండాఫ్పై అందరి దృష్టి పడింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్ర పరిశ్రమకు కాసుల వర్షం కురిపించడానికి స్టార్ హీరోలు సరికొత్త కంటెంట్తో థియేటర్లలోకి దూసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు- సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో టాలీవుడ్ టాప్-5 క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. వైవిధ్యమైన కథాంశాలతో విభిన్న కాస్టింగ్ - క్రూ కలయికలో వస్తున్న ఈ చిత్రాలలో ఏ సినిమా కంటెంట్ బెస్ట్గా నిలిచి, బాక్సాఫీస్ విజయాన్ని అందుకోబోతుందనే ఆసక్తికరమైన చర్చ పరిశ్రమ వర్గాల్లో నడుస్తోంది.
ఈ రేసులో అందరికంటే ముందుగా మాస్ మహారాజా రవితేజ `ఇరుముడి` చిత్రంతో థియేటర్లను పలకరించనున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ యాక్షన్ డైరెక్టర్లు, భారీ సాంకేతిక నిపుణుల బృందం (క్రూ) పనిచేస్తున్నారు. భక్తి, మిస్టరీ - హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు ఈ కథలోని డివోషనల్ టచ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ఆగస్టు 21న గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతోంది.
సరిగ్గా అదే ఆగస్టు 21వ తేదీన నేచురల్ స్టార్ నాని కూడా `ది ప్యారడైజ్` చిత్రంతో రవితేజకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్.. బలమైన సపోర్టింగ్ కాస్టింగ్ నటిస్తున్నారు. ఒక విలక్షణమైన సోషల్ డ్రామా - క్రైమ్ సస్పెన్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథాంశం ఉండబోతున్నట్లు టాక్. నాని తన నటనతో కథను నడిపించే పీరియాడిక్ ఎలిమెంట్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ - డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. రవితేజ `ఇరుముడి`తో బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడనుంది. ఈ ఇద్దరిలో ఎవరి కంటెంట్ బెస్ట్ అనేది ఆగస్టు 21న తేలిపోనుంది. ఎలాంటి సినీ నేపథ్యంతో పని లేకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్లుగా రవితేజ, నేచురల్ స్టార్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఇద్దరూ పోటీపడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక వెర్సటైల్ నటుడు శర్వానంద్ సైతం ఈ రేసులో ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో అతడు నటిస్తున్న `భోగి` చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సెంటిమెంట్తో పాటు హృదయానికి హత్తుకునే ఒక విభిన్నమైన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాథీ అందచందాలు, గ్లామర్ ట్రీట్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. శర్వానంద్ మాస్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. శ్రీ శ్రీనివాస సాయి బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్, ప్రమోషన్స్ దశలో ఉన్న ఈ సినిమా.. నాని, రవితేజల సినిమాల విడుదలైన వారం రోజుల గ్యాప్లోనే వస్తుండటంతో.. క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో ఈ కంటెంట్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో మరో ఇద్దరు క్రేజీ హీరోలు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ మాస్ రోల్లో నటిస్తున్న `రణబలి` చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో భారీతనంతో నిర్మిస్తోంది. ఊరమాస్ కథాంశంతో... అద్భుతమైన ఫైట్స్ - యాక్షన్ అంశాలతో ఈ సినిమా రక్తికట్టించనుంది. ఇప్పటికే షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. అలాగే దేవరకొండ `రౌడీ జనార్ధన`గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ``ప్రపంచంతో పోరాడే వ్యక్తి ప్రేమకు మాత్రమే తలవంచుతాడు` అనే ఉపశీర్షికతో డిజైన్ చేసిన ఈ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.. అలాగే ఆ తర్వాత టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయిన విక్టరీ వెంకటేష్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న `ఆదర్శ కుటుంబం` అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రానుంది. పాపులర్ నటీనటులతో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ - హ్యూమర్తో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొత్తానికి ఈ ఐదారు చిత్రాల కంటెంట్ ఒకదానికొకటి భిన్నంగా ఉండటంతో 2026 సెకండాఫ్ బాక్సాఫీస్ రిజల్ట్ ఎవరి పక్షాన నిలుస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది.