చైతో డేటింగ్ -పెళ్లిపై జనాల ఆరాలు.. శోభిత ఏం చేసారో తెలుసా?
అయితే సమంత రూత్ ప్రభుతో నాగచైతన్య విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత అంటే 2022 నుంచే వీరిద్దరి డేటింగ్ గురించిన రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఎదుటివాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి.. ముఖ్యంగా సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉబలాటం కామన్ జనాల్లో ఉండటం చాలా సహజం. అయితే దీనిని ఎక్కువగా తలకెక్కించుకోకుండా లైట్ తీస్కోవడం ఎలానో శోభిత చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నాగచైతన్యతో తన డేటింగ్, పెళ్లి వ్యవహారాలపై జనాల ఆసక్తిని తాను పెద్దగా పట్టించుకోలేదని, వారి క్యూరియాసిటీపై తాను పెద్దగా ఆలోచించలేదని శోభిత సింపుల్ గా చెప్పారు. అలాంటి వాతావరణాన్ని అంతగా పట్టించుకోకూడదని, మన పనేదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే సరైన విధానమని కూడా సూచించారు.
నటి శోభితా ధూళిపాళ్ల- అక్కినేని నాగచైతన్యల వివాహం 4 డిసెంబర్ 2024న వైభవంగా జరిగింది. అంతకుముందు అదే ఏడాది ఆగస్టులో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే సమంత రూత్ ప్రభుతో నాగచైతన్య విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత అంటే 2022 నుంచే వీరిద్దరి డేటింగ్ గురించిన రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ సమయంలో ఈ జంట తమ రిలేషన్షిప్పై వస్తున్న వార్తలకు స్పందించకపోయినా.. ఈ జంటపై ప్రజల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా `గలాట్టా ప్లస్` ఇంటర్వ్యూలో శోభితా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంపై పబ్లిక్ స్క్రూటినీ- భిన్నమైన అభిప్రాయాలు ఎలా ఉన్నా తాను ఎలా స్థిరంగా ఉండగలుగుతుందో రివీల్ చేసారు.
ఈ ఇంటర్వ్యూలో శోభితా మాట్లాడుతూ.. తన రిలేషన్షిప్పై వచ్చిన అటెన్షన్ చూసాక బయటి వ్యక్తులు సౌండ్ చేసినా తాను పట్టించుకోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలిపింది. ప్రజలకు కుతూహలం మాత్రమే ఉంటుంది. నేను నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను.. నా నుండి ఎలాంటి స్పందన ఆశిస్తున్నారో నాకు తెలియదు. కాలక్రమేణా నేను ఎవరో నాకు బాగా అర్థమైంది.. నాపై నాకు నమ్మకం పెరిగింది. నా చుట్టూ ఎన్ని భిన్నమైన, వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నా వాటితో ప్రభావితం కాకుండా ప్రశాంతంగా కూర్చోగలగడం నాకు అలవాటైంది.. అని శోభిత పేర్కొన్నారు. పబ్లిక్ మనం ఏం చేస్తున్నామో ఆరాలు తీయడం కొన్నిసార్లు సీరియస్ మ్యాటర్లా అనిపించినా.. ఇదంతా కేవలం తాత్కాలికమేనని అర్థం చేసుకున్నట్టు శోభిత తెలిపారు. సోషల్ మీడియా ట్రెండ్ కేవలం టెంపరరీ అని కూడా శోభిత అన్నారు.
అలాగే పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటే అసంపూర్ణుడు అనే అభిప్రాయంతో శోభిత విభేధించారు. సిసలైన ప్రేమ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం.. మన భాగస్వామి మనమేంటో గుర్తు చేస్తారు తప్ప.. మనలోని విషయాలను భర్తీ చేయరు! అని శోభితా అభిప్రాయపడింది. సోల్ మేట్ తో సంపూర్ణులు అవుతామని నమ్మను.. ఒకరు ప్రయాణంలో తోడై మన నైజాన్ని మనకు గుర్తుచేస్తారే తప్ప.. ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఎవరూ అసంపూర్ణులు కారని శోభిత వ్యాఖ్యానించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పా.రంజిత్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం `వెట్టువం`లో శోభిత నటిస్తుండగా, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న `వృషకర్మ` అనే హారర్ మైథోలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.