కొత్త సినిమాలకు టీ20 ఫైనల్ ఎఫెక్ట్!
గత కొంత కాలంగా భారీ సినిమాలకు, చిన్న సినిమాలకు వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి.;
గత కొంత కాలంగా భారీ సినిమాలకు, చిన్న సినిమాలకు వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా పెట్టెబడిని రాబట్టడానికి రెండు మూడు వారాలు మాత్రమే సమయం ఉంటోంది. ఆ సమయంలోనే పెట్టుబడితో పాటు లాభాల్ని సొంతం చేసుకోవాలని మేకర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలకు అది వర్కవుట్ అవుతున్నా కొన్నింటికి ఆ సమయంలో ఎదురయ్యే కీలక ఈవెంట్లు ఇబ్బందికరంగా మారుతూ వసూళ్లపై ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి.
దీంతో మేకర్స్ తమ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఎలాంటి ఇతర ఇబ్బందులు, బంద్లు, ప్రత్యేకించి ఐపీఎల్, టీ20 వంటివి ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే ఈ వారం విడుదలైన సినిమాలకు మాత్రం పెద్ద గండమే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం శ్రీవిష్ణు నటించిన `మృత్యుంజయ్`, శివాజీ, లయ జంటగా నటించిన `సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`, వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన `సరస్వతి`, శ్రీనాథ్ మాగంటి హీరోగా `మెన్షన్ హౌస్ మల్లేష్` వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ లెక్కలు, థియేట్రికల్ ఎనాలసిస్ని బట్టి టాక్తో సంబంధం లేకుండా ప్రతి సినిమా శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంటే వీకెండ్ వరకు మంచి వసూళ్లని రాబడుతోంది. ఈ మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిలో చాలా వరకు లాగేసుకుంటున్నాయి. దీంతో ఈ మూడు రోజుల వసూళ్లు ప్రతి సినిమాకు అత్యంత కీలకంగా మారాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మూడు రోజుల్లోనే వీలైనంత వరకు వసూళ్లని దక్కించుకుని సేఫ్ జోన్లోకి వెళ్లిపోవాలని ప్రతి నిర్మాత, దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఈ సినిమాలకు ఈ వీకెండ్ పెద్ద పరీక్షగా మారబోతోంది. అనుకున్నంత ఈజీగా ఈ వీకెండ్ వసూళ్లు ఉండేలా కనిపించడం లేదు. కారణం ఈ ఆదివారం ఇండియన్ క్రికెట్ టీమ్ టీ20 మ్యాచ్లో భాగంగా న్యూజిలాండ్తో ఫైనల్ కోసం తలపడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ చూడటానికే ఇష్టపడతారు. థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించే అవకాశం లేదు. దీంతో ఈ వారం విడుదలైన సినిమాలకు ఇది భారీ ఎఫెక్ట్ని ఇచ్చే అవకాశం ఉందని కనిపిస్తోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్ వినోదం కోసం థియేటర్లకు భారీగా విచ్చేసినా సినిమా వసూళ్లపై మాత్రం టి20 ఫైనల్ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో శ్రీవిష్ణు నటించిన `మృత్యుంజయ్` హిట్ టాక్ని సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు వీకెండ్ వసూళ్లు అనుకున్న స్థాయలో లభించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.