'రెగ్యులర్ హీరోయిన్' ఇమేజ్ నుంచి బయటకు!
సినీపరిశ్రమలో ఇటీవల పరిస్థితులు అమాంతం మారిపోయాయి. ఓటీటీల రంగ ప్రవేశంతో నటీనటులకు ఎంపిక చేసుకునే అవకాశం పెరిగింది.;
సినీపరిశ్రమలో ఇటీవల పరిస్థితులు అమాంతం మారిపోయాయి. ఓటీటీల రంగ ప్రవేశంతో నటీనటులకు ఎంపిక చేసుకునే అవకాశం పెరిగింది. ఇంతకుముందు కేవలం గ్లామరస్ పాత్రలలో మాత్రమే అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. నటీమణులకు కూడా నిరూపించుకునే అవకాశాలు పెరిగాయి. రాధికా ఆప్టే, సమంత వంటి నటీమణులు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాధిక ఆప్టే లాంటి నటీమణి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే, నటిగా నిరూపించుకునేందుకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం గ్లామర్ ఎలివేషన్ కోసం నటనలో కొనసాగేందుకు సిద్ధంగా లేనని రాధిక గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల రాధిక బాటలోనే తాను కూడా గ్లామర్ ఎలివేషన్ కోసం కాకుండా, తనను తాను నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రలకు మాత్రమే సంతకాలు చేస్తోంది సామ్.
సమంత ఇప్పుడు కేవలం గ్లామర్ కోసమో లేదా స్టార్ హీరోల పక్కన కనిపించాలనో సినిమాలు చేయడం లేదు. రీసెంట్గా వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ వాణిజ్య పంథా సినిమాలను ఆమె సున్నితంగా తిరస్కరించడం దీనికి నిదర్శనం. డిజిటల్ స్పేస్ (ఓటీటీ) పై దృష్టి పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వెబ్ సిరీస్లలో నటనకు, పాత్రలోని లోతును ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశం ఉండటంతో ఆమె నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు.
నందినీ రెడ్డి దర్శకత్వంలో `మా ఇంటి బంగారం` చిత్రం మేలో విడుదల కానుంది. ఇందులో నటిగానే కాదు, నిర్మాతగాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది సామ్. ఈ చిత్రానికి సమంత స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక నటిగా పాత్రలో దమ్ముంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
రాధికా ఆప్టే మొదటి నుంచీ కంటెంట్ ఆధారిత చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు సమంత కూడా అదే బాటలో నడుస్తున్నారు. గ్లామర్ ఉన్నా కూడా, అందులో ఒక ఉత్కంఠ లేదా నటనకు స్కోప్ ఉండేలా చూసుకోవడానికే సమంత ఆసక్తిగా ఉంది.
సమంత ఇప్పుడు `రెగ్యులర్ హీరోయిన్` ఇమేజ్ నుండి బయటకు వచ్చి ఒక `పర్ఫార్మర్` గా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నారు. గ్లామర్ కంటే కంటెంట్కే ప్రాధాన్యత ఇవ్వడం కెరీర్ను లాంగ్ రన్ లో మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతోంది. ఇటీవల పెరిగిన క్రేజ్ దృష్ట్యా సమంత పారితోషికంలో ఎక్కడా తగ్గడం లేదన్న చర్చా సాగుతోంది.