స‌ద్గురు ప్ర‌శ్న‌: య‌ష్‌ను రావ‌ణుడిగా తీసుకోవ‌డానికి కార‌ణం?

ఈసారి హెడ్ లైన్స్ లోకి రావ‌డానికి కార‌ణం ఆధ్యాత్మిక గురువు సద్గురు... చిత్ర‌నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రాపై స‌ద్గురు సంధించిన ఓ ప్ర‌శ్న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.;

Update: 2025-10-31 04:38 GMT

నితీష్ తివారీ `రామాయ‌ణం` నిరంత‌రం ఏదో ఒక కార‌ణంతో హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. ఈసారి హెడ్ లైన్స్ లోకి రావ‌డానికి కార‌ణం ఆధ్యాత్మిక గురువు సద్గురు... చిత్ర‌నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రాపై స‌ద్గురు సంధించిన ఓ ప్ర‌శ్న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రామాయ‌ణంలో శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్, సీత‌గా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్నారు స‌రే, రావ‌ణుడిగా అంద‌గాడైన య‌ష్ నే ఎందుకు తీసుకున్నారు? అనేది స‌ద్గురు ప్ర‌శ్న‌. నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రాను మ‌త‌గురువు సూటిగా ప్ర‌శ్నించారు. రావ‌ణుడి పాత్ర‌కు గొప్ప ఇమేజ్ ఉన్న‌, భార‌త‌దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఒక స్టార్ ని తీసుకోవాల‌ని అనుకున్నాం... బ‌హుశా య‌ష్ ని ఎంపిక చేయ‌డానికి కార‌ణం అదే కావొచ్చు అని నమిత్ అన్నారు.

రావణుడు చాలా ముఖ్యమైన పాత్ర.. దానికి ఆదర్శవంతమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలనుకున్నామ‌ని న‌మిత్ వివ‌ర‌ణ ఇచ్చారు. మేం దాదాపుగా సూపర్ స్టార్ స్థాయి వ్యక్తిని ఆ పాత్ర పోషించడానికి ఎంపిక చేయాల‌నుకున్నాము అని అన్నారు.

అయితే సద్గురు విలన్ ఎలా ఉండాలో వ‌ర్ణించారు. విలన్ అంటే ఎల్లప్పుడూ అతడికి మొద్దుబారిన ముక్కు ఉండాలి. ఎత్తు ఎక్కువగా ఉండాలి. కానీ యష్ ఒక అందమైన వ్యక్తి క‌దా? అని నమిత్ ను మ‌ళ్లీ ప్ర‌శ్నించారు. య‌ష్ ఎలా ఉంటాడో నాకు తెలుసును అని స‌ద్గురు అన్నారు.

దీనికి న‌మిత్ స్పందిస్తూ... దేశంలో చాలా అంద‌మైన ప్ర‌తిభావంతుడైన స్టార్ య‌ష్. అత‌డు ఈ పాత్ర‌ను ప్రేమించి చేస్తున్నాడు. అత‌డిని ఆ పాత్ర‌లో ఎలా చూపించాలి? అనేది ఒక్క‌టే మేం ఆలోచించామ‌ని అన్నారు.

అయినా స‌ద్గురు సంతృప్తి చెంద‌లేదు. విల‌న్ల‌కు ఎప్పుడూ మొద్దుబారిన ముక్కు ఉంటుంది.. ప‌దునైన ముక్కు కాదు..అని రెట్టించి ప్ర‌శ్నించారు. య‌ష్ ని గ‌మ‌నించారా? అని అడిగారు. దానికి నమిత్ న‌వ్వులు చిందిస్తూ, యష్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారో మ‌రోసారి వివరించడానికి ప్రయత్నించాడు. ``ఇది నిజంగా నాకు కొత్త పాఠం.. నేను దీనిని(స‌ద్గురు సూచించిన‌దానిని) పరిశీలిస్తాను. కానీ రావణుడిలో చాలా ఛాయ‌లు ఉండాలి.. అతడు శివునికి భక్తుడు క‌దా! అని అన్నారు. మొత్తానికి సద్గురుతో నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా స‌ర‌దా సంభాష‌ణ‌లు, చ‌తుర‌త అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

నితేష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న రామాయ‌ణం రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. 2026 దీపావ‌ళికి మొద‌టి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుద‌ల కానున్నాయి. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

Tags:    

Similar News