మెగాస్టార్ హీరోయిన్.. దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఏజెంట్
గ్లామర్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టడం చాలా బావుందని రిమ్మీ అన్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం చాలా క్రమశిక్షణతో కూడుకున్నదని ఆమె ప్రశంసించారు.;
`ఇదే నా మొదటి ప్రేమలేఖ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రిమ్మీసేన్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన `అందరివాడు` చిత్రంలో నటించారు. గ్లామరస్ పాత్రతో ఈ బ్యూటీ మెప్పించింది. బాలీవుడ్ లో ధూమ్, హంగామా, గోల్మాల్ వంటి సూపర్ హిట్ సినిమాలలోను నటించింది. అయితే రిమ్మీ సేన్ అకస్మాత్తుగా గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచాన్ని వదిలేసి పూర్తిగా వేరొక రంగంలోకి వెళ్లిపోవడం అభిమానులకు షాకిచ్చింది.
తాజాగా తన కొత్త కెరీర్ గురించి రిమ్మీ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. తను ఇప్పుడు నటనకు దూరంగా ఉంటూ, దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజా ఇంటర్వ్యూలో ``బాలీవుడ్ను ఎందుకు వదిలేశారు?`` అంటూ హోస్ట్ ప్రశ్నించారు. సినిమాల్లో హీరోయిన్లను కేవలం ఒక గ్లామర్ ప్రాపర్టీ లాగా మాత్రమే చూస్తున్నారని, కథలో వారికి పెద్దగా ప్రాముఖ్యత ఉండటం లేదని ఆమె విసుగు చెందారు. కేవలం హీరోల వెనుక నిలబడి ఏడవడానికి లేదా పాటలకే పరిమితం కావడం నచ్చక సినిమాలకు స్వస్తి చెప్పానని రిమ్మీ తెలిపారు. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని, మహిళలకు కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దుబాయ్ రియల్ ఎస్టేట్లో..
గ్లామర్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టడం చాలా బావుందని రిమ్మీ అన్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం చాలా క్రమశిక్షణతో కూడుకున్నదని ఆమె ప్రశంసించారు. అక్కడ డెవలపర్లు, ఏజెంట్లు ఎవరి పని వారు నిక్కచ్చిగా చేస్తారని, వ్యవస్థ చాలా పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను `ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్` లాగా ఎంతో గౌరవిస్తారని, అదే ఇండియాలో రెండు నెలల బ్రోకరేజ్ అడిగితే ఏదో నేరం చేసినట్లు చూస్తారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇండియాలో నిబంధనలు తరచూ మారుతుంటాయని, ట్యాక్స్లు ఎక్కువగా ఉంటాయని ఆమె విమర్శించారు. అందుకే వ్యాపారం చేయడానికి దుబాయ్ చాలా సౌకర్యవంతంగా ఉందని భావిస్తున్నట్టు తెలిపారు.
ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై..
ఇటీవల రిమీ సేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీటిపై పుకార్లు మొదలయ్యాయి. రిమ్మీ అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని.. కేవలం ఫిల్లర్స్, బొటాక్స్, పీఆర్పీ ట్రీట్మెంట్ వంటి నాన్-సర్జికల్ పద్ధతులు మాత్రమే వాడుతున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రిమ్మీ దుబాయ్లో సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా రాణిస్తున్నారు.
మొదటి సినిమా..
2001ఇదే నా మొదటి ప్రేమలేఖ రిమీ సేన్ కథానాయికగా పరిచయమైన మొదటి సినిమా. 2002 లో `నీ తోడు కావాలి` సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 2005 లో అందరివాడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ఈ సినిమా ఆమె కెరీర్లో అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్. చిరంజీవితో నటించిన `అందరివాడు` సినిమాలో రిమ్మీ నటన, గ్లామర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటల్లో డ్యాన్స్ లకు మంచి మార్కులు పడ్డాయి. రిమీ సేన్ టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వచ్చే లోపే బాలీవుడ్లో బిజీ అయిపోయారు. ధూమ్, గోల్మాల్ వంటి విజయాల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు.