బిగ్ బిగ్ : 'రామయణ' ఎదురు చూపులకు తెర
ఎట్టకేలకు రామాయణ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్, అంతే కాకుండా గ్లిమ్స్ రాబోతున్నాయి.;
దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణ' సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, సౌత్ స్టార్ హీరోయిన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న రామాయణ సినిమాలో రావణుడి పాత్రను కేజీఎఫ్ స్టార్, కన్నడ రాక్ స్టార్ యశ్ పోషిస్తూ ఉన్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న విషయం తెల్సిందే.
గత రెండేళ్ల కాలంగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పుకార్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు చూడటం తప్ప యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అదుగో ఇదుగో అంటూ రామాయణ గురించి సోషల్ మీడియాలో పుకార్లు, లీక్ ఫోటోలు మాత్రమే వైరల్ అవుతూ వచ్చాయి. ఎట్టకేలకు రామాయణ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్, అంతే కాకుండా గ్లిమ్స్ రాబోతున్నాయి. అది కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రామాయణ టైటిల్ గ్లిమ్స్ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. దేశంలోని ప్రధానమైన 9 నగరాల్లో ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను బిగ్ స్క్రీన్ పై స్క్రీనింగ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేశారు.
జులై 3వ తారీకు అంటే రేపే ఉదయం 11.30 గంటలకు 9 స్క్రీన్స్లో గ్లిమ్స్ స్క్రీనింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హైదరాబాద్ ప్రేక్షకుల కోసం ఈ గ్లిమ్స్ను ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేసి అందులో పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అహ్మాదాబాద్, కోల్కత్తా, పూణే, కొచ్చి, ముంబై ల్లో ఈ స్క్రీనింగ్ ఉండబోతుంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు రామాయణ సినిమా ను వెండి తెరపై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు మూడు పార్ట్లుగా ఈ సినిమాను తీసుకు రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్ తో రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ ముగింపు దశకు వచ్చి ఉంటుందని, అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడంలో భాగంగానే రామాయణ గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా యశ్ కూడా ఉండటం విశేషం. కేజీఎఫ్లో రాఖీ భాయ్గా ఆకట్టుకున్న యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రావణుడిగా రామయణ సినిమా తో రాబోతున్నాడు.
ఈ సినిమాలో ఇంకా ఎంతో మంది బాలీవుడ్, సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన రామాయణ ఇతివృత్త మూవీ ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయినా కూడా రామాయణ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆదిపురుష్తో సంబంధం లేకుండా రామాయణ సినిమాను జనాలు కోరుకుంటున్నారు. త్వరలోనే రామాయణకు సంబంధించిన రిలీజ్ డేట్ను సైతం ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. టైటిల్ గ్లిమ్స్ అంటున్నారు కనుక అందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి లుక్ రివీల్ చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.