ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక: రామ్ చరణ్ ఫ్యాన్స్
గేమ్ ఛేంజర్ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీసాయి;
గేమ్ ఛేంజర్ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీసాయి. సినిమాకు జరిగిన నష్టాల గురించి వారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి జరిగిన ప్రస్తావనలతో గ్లోబల్ స్టార్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ నోట్ను విడుదల చేశారు. ఇందులో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ నోట్లో చరణ్ ఫ్యాన్స్, “సినిమా అనేది ఒక బిజినెస్. ఇందులో లాభాలు, నష్టాలు సహజం. కానీ మీరు ఒక విజయం వస్తే మీకే క్రెడిట్ తీసుకుంటారు. కానీ నష్టం వస్తే మాత్రం అందరిపై ఆరోపణలు చేస్తారా?” అంటూ మండిపడ్డారు. దీనితో పాటు పలు కీలక ప్రశ్నలు కూడా లేఖలో ఉత్కంఠగా పేర్కొన్నారు.
వారు లేఖలో పేర్కొన్న 6 కీలక పాయింట్లు వైరల్ అవుతున్నాయి.
1. 1 నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్త, హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?
2. మైత్రీ బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?
3. సైంధవ్ ఫెయిల్ అయ్యాక, ఆ నిర్మాత, వెంకటేశ్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ?
4. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయితే వెంకటేశ్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా ? ఎక్స్ట్రా ఎమైనా ఇచ్చారా ?
5. “దర్శకుడు శంకర్ ఉన్నాడు" అని వెళ్లింది ఎవరు? “ఒక సంవత్సరం” అంటూ 3 సంవత్సరాలు వృథా చేసినది ఎవరు?
6. RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా?.. అని ప్రశ్నించారు.
అభిమానులు, మూడు సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూసిన తమ ఆవేదనను వివరించారు. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తాము ఇప్పటికే నిరాశతో ఉన్నామని తెలిపారు. అయితే, ప్రతి ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చర్చించటం, హీరో గురించి విమర్శించడం తగదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధిస్తున్నాయని, ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అని అభిమానులు పేర్కొన్నారు. ఇకపై గేమ్ ఛేంజర్ సినిమా గురించి, రామ్ చరణ్ గారి గురించి ఏవైనా నెగిటివ్ వ్యాఖ్యలు వస్తే, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. “ఖబద్ధార్” అంటూ గట్టిగానే తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. “ఇట్లు.. రామ్ చరణ్ అభిమానులు” అని ముగించారు. ఈ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.