'పెద్ది' ఈవెంట్లో కోస్టార్ మాట్లాడ‌కుండా చ‌ర‌ణ్ ఆపేశారా?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది.

Update: 2026-06-02 08:36 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ భారీ ఈవెంట్‌లో ఒక ఎంపీ, ఒక మంత్రి ముఖ్య అతిథులుగా, చిత్ర యూనిట్ అంతా పాల్గొనగా... బాలీవుడ్ నటుడు, `మిర్జాపూర్` ఫేమ్ దివ్యేందు శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ స్టేజ్ పై దివ్యేందు మాట్లాడుతుండగా రామ్ చరణ్ ఆయనను మధ్యలో ఆపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహనటుడు మాట్లాడుతుండగా చరణ్ ఎందుకలా వారించాల్సి వచ్చింది? అనే ప్ర‌శ్న ఎదురైంది. అయితే దానికి బ‌ల‌మైన‌ కార‌ణాలు లేక‌పోలేదు.

ఈ ఈవెంట్‌లో దివ్యేందు శర్మ తెలుగులో మాట్లాడుతూ అక్కడికి వచ్చిన అభిమానుల్లో జోష్ పెంచారు. ``విజయవాడ ప్రజలకు నమస్కరిస్తున్నా. మీరంతా నా కుటుంబం`` అంటూ ఈ హిందీ యువ‌న‌టుడు ముచ్చటించారు. తనకు టాలీవుడ్‌లో మొదటిసారిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి అని, ఆయనతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవమని పేర్కొంటూ... సెట్స్‌లో తనను ఎంతో కంఫర్ట్‌గా చూసుకున్నారని చరణ్‌పై ప్రశంసలు ప్ర‌శంసించారు.

అయితే ప్రసంగం మధ్యలో దివ్యేందు శర్మ తాను దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న `మిర్జాపూర్` వెబ్ సిరీస్ లోని ఫేమస్ డైలాగ్ ఒకటి చెబుతానని అనడంతో అసలు కథ మొదలైంది. ఆయన ఆ డైలాగ్ చెప్పబోతుండగా రామ్ చరణ్ వెంటనే స్పందించి వద్దంటూ సరదాగా వారించారు. మనకు తెలిసిందే... మిర్జాపూర్ సిరీస్ లోని మున్నా భయ్యా పాత్ర చెప్పే డైలాగులలో కాస్త బూతు ఎక్కువే. లైవ్ ఈవెంట్ లో కుటుంబ సమేతంగా చూసే వేదికపై అలాంటి భాష మంచిది కాదనే ఉద్దేశంతోనే రామ్ చరణ్ ఎంతో సమయస్ఫూర్తితో అత‌డిని సరదాగా నవ్వుతూనే ఆపేశారు.

ఈ చిన్నపాటి సరదా సంఘటన మినహాయిస్తే దివ్యేందు సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే పోరాటమే `పెద్ది` అని... ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ అని వివరించారు. జూన్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.... అభిమానులంతా థియేటర్లలో ఇదే ఎనర్జీతో సినిమాను చూసి ఆదరిస్తారని నమ్ముతున్నట్లు దివ్యేందు శర్మ ముగించారు.



Tags:    

Similar News