దారుణమైన నిర్మాతలు.. చెలరేగిన రాధిక ఆప్టే
నేను, మా అమ్మ ఒప్పందంపై సంతకం చేయమని అడిగినప్పుడు... "అరే.. ఊర్మిళ మటోండ్కర్ కూడా ఒప్పందంపై సంతకం చేయలేదు" అని అన్నారు.;
`రక్త చరిత్ర` చిత్రంలో తన అద్భుత నటనతో ఆకట్టుకుంది రాధిక ఆప్టే. పరిటాల రవి సతీమణి (సునీత) పాత్రలో ఆప్టే నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ సహా పలువురు టాప్ హీరోల సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైంది. హిందీ చిత్రసీమలో ఉండగానే వరుసగా వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బిజీ అయిపోయింది.
ఆప్టే నటనా రంగంలో ప్రవేశించి రెండు దశాబ్ధాలు అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అనుభవం గురించి ముచ్చటించింది. నిజానికి తొలి సినిమా అనుభవాన్ని తాను మర్చిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పింది ఆప్టే. ఆ సినిమా నిర్మాత తనకు కనీస సౌకర్యాలు ఇవ్వలేదు. దారుణంగా చూసాడు. కనీసం అగ్రిమెంట్ పై సంతకం కావాలని అడిగినా దానికి కూడా ససేమిరా అన్నాడు. పైగా ఊర్మిళ మటోండ్కర్ కే దిక్కులేదు.. ఇలాంటి అగ్రిమెంట్లు చేయలేను! అని అన్నాడు. మొదటి సినిమా అనుభవం గురించి చెబెతూ చిత్ర నిర్మాత సంగీత అహిర్ను రాధిక నిందించారు.
"ఆ దారుణమైన నిర్మాతలు నాకు వసతి కల్పించలేదు.. కనీసం నాకు డబ్బులు కూడా చెల్లించలేదు. నేను, మా అమ్మ ఒప్పందంపై సంతకం చేయమని అడిగినప్పుడు... "అరే.. ఊర్మిళ మటోండ్కర్ కూడా ఒప్పందంపై సంతకం చేయలేదు" అని అన్నారు. కానీ వారు మమ్మల్ని చాలా దారుణంగా చూశారు. నాకు ఈ అవకాశం రావడానికి కారకుడైన మహేష్ మంజ్రేకర్ చాలా మంచి వ్యక్తి. అందుకే నేను ఆ సినిమాను మర్చిపోవాలనుకుంటున్నాను.. ఎందుకంటే ఆ సినిమా నిర్మాణ చాలా దారుణం.. అని ఆప్టే నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. షాహిద్ కపూర్, సంజయ్ దత్, అమృతా రావు, అర్షద్ వార్సీ వంటి స్టార్లు నటించిన తన తొలి చిత్రం 'వాహ్! లైఫ్ హో తో ఐసీ!'ని మర్చిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
ఆ సినిమాలో సహాయ పాత్ర పోషించిన రాధిక తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో కూడా వెల్లడించారు. తాను ఒక స్టేజీ డ్రామాలో 'బ్రెయిన్ సర్జన్` పాత్రను పోషించాను. అది మంచి నాటకం.. మేం రాష్ట్ర స్థాయి పోటీలో అవార్డు గెలుచుకున్నాము. మహేష్ మంజ్రేకర్ న్యాయనిర్ణేతలలో ఒకరు. నాటకం ముగిసిన తర్వాత మంజ్రేకర్ ఫోన్ చేసి ఒక సినిమాలో నటింపజేయాలనుకుంటున్నాను.. అని తెలిపారు. ఆ తర్వాత నేను చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. నా కాలేజీ చదువు పూర్తి చేశాను. అటుపై చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. రెండు దశాబ్ధాలుగా ఈ ప్రయాణం సాగుతోంది" అని తెలిపింది.
జీ5 లో స్ట్రీమ్ అవుతున్న 'సాలీ మొహబ్బత్' అనే సైకలాజికల్ థ్రిల్లర్లో తన నటనకు రాధిక ప్రశంసలు అందుకుంటున్నారు. టిస్కా చోప్రా డెబ్యూ దర్శకురాలిగా నిరూపించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI), చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రముఖ ఉత్సవాలలో ఇప్పటికే ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఘాఢంగా హత్తుకునే డ్రామాలో రాధిక తన నటనకు ప్రశంసలు అందుకుంది.