అప్పుడు చిరు శ్రీదేవి.. ఇప్పుడు చరణ్ జాన్వీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ సినిమా ట్రైలర్ తాజాగా ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో విడుదలైంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరింత హైప్ తీసుకొచ్చింది.
ముంబైలో గ్రాండ్ గా నిర్వహించిన ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ కు చరణ్, జాన్వీ, బుచ్చిబాబు సాన, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నిర్మాత సతీష్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటుడు దివ్యేందు శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్.. పెద్ది సినిమా తమ జీవితాల్లో స్పెషల్ గా నిలిచిపోతుందని అన్నారు. "సినిమా కోసం మేమంతా రెండేళ్లుగా కష్టపడుతున్నాం. కానీ బుచ్చిబాబు మాత్రం ఐదేళ్లుగా కథతోనే జీవిస్తున్నాడు. రెహమాన్ సర్ ను ఆ ప్రాజెక్టులోకి తీసుకు వచ్చినందుకు బుచ్చిబాబుకు థ్యాంక్స్" అని తెలిపారు.
ప్రతి సినిమాకు కొన్ని పిల్సర్స్ ఉంటాయని, కానీ పెద్దికి రెహమాన్ సర్ మెయిన్ పిల్లర్ అని చరణ్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "ఆమె చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. 85 రోజుల పాటు నాన్ స్టాప్ షూటింగ్ చేశాం. ఒక పాటలో నాకంటే బాగా డ్యాన్స్ చేసింది. చాలా సైలెంట్ గా ఉండి ప్రతి విషయాన్ని నేర్చుకుంటుంది" అని ప్రశంసించారు. అలాగే తన తండ్రి చిరంజీవి, జాన్వీ తల్లి శ్రీదేవి గతంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేశారు.
"మా నాన్న, శ్రీదేవి గారు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పుడు చరణ్- జాన్వీ నటిస్తున్నాం. ఇది మా కుటుంబానికి, అభిమానులకు ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్. మా పెయిర్ ప్రేక్షకులను నిరాశపరచదు" అని చరణ్ అన్నారు. సినిమాలో తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డారో కూడా ఆయన వివరించారు. "సినిమాలో దాదాపు 30 రోజుల పాటు కుస్తీ సన్నివేశాలు షూట్ చేశాం. ఆ సన్నివేశాల కోసం నిజమైన కుస్తీ క్రీడాకారులనే తీసుకొచ్చారు. వాళ్లు నిజంగానే ఫైట్ చేయడంతో చాలా గాయాలు అయ్యాయి. ఫిజికల్ గా ఇది నా కెరీర్లో చాలా ఛాలెంజింగ్ మూవీ" అని తెలిపారు.
హిందీ చిత్రాలు సుల్తాన్, దంగల్ తనకు ప్రేరణగా నిలిచాయని చెప్పారు. "సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కుస్తీ నేపథ్యంలో చేసిన సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతో కష్టపడ్డాను. కథ విన్న వెంటనే ఫిజికల్ గా కఠినమైన సినిమా అని అర్థమైంది. అయినా వెంటనే ఓకే చెప్పాను" అని అన్నారు. "నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఇది ఒకటి. ఇలాంటి కథలు ప్రతి హీరోకి రావు. మా నాన్న కూడా ఈ సినిమా వదులుకోవద్దని చెప్పారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత నా లైబ్రరీలో నిలిచిపోయే మరో సినిమా పెద్ది అవుతుంది" అని రామ్ చరణ్ తెలిపారు.