చెల్లి కోసం వెళ్లి, అక్క‌ను ఫైన‌ల్ చేసిన డైరెక్ట‌ర్

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమాల్లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పెద్ది ఒక‌టి.

Update: 2026-05-16 07:32 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమాల్లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పెద్ది ఒక‌టి. ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి వ‌స్తున్న సినిమా కావడం, మరోవైపు రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంద‌రికీ ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ఈ స‌మ్మ‌ర్ లో సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న బాక్సాఫీస్‌కు పెద్దినే నిజమైన ఆశగా చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ పూర్తి మాస్ లుక్, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎమోషన్స్.. ఇవ‌న్నీ కలిసి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

పెద్ది సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర తర్వాత ఆమె చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే. కానీ అసలు విషయమేంటంటే, ఈ సినిమా కోసం మొదట ఎంపికైన హీరోయిన్ జాన్వీ కాదట. డైరెక్ట‌ర్ బుచ్చిబాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తాము మొదట ఈ కథకు జాన్వీ చెల్లి ఖుషి క‌పూర్ ను అనుకున్నామని, ఆమె పాత్రకు సూట్ అవుతుందని భావించి డిస్క‌ష‌న్స్ కూడా చేశామ‌ని తెలిపారు.

అయితే చివరికి కొన్ని కారణాల వల్ల ఖుషి స్థానంలో జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరీమణుల్లో చెల్లెలు చేయాల్సిన పాత్రను అక్క చేయడం ఇండస్ట్రీలో అరుదైన పరిణామంగా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా ఒక హీరో లేదా హీరోయిన్ చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం సాధారణమే అయినా, ఒకే ఇంట్లోని ఇద్దరు సిస్టర్స్ మధ్య ఇలా ప్రాజెక్ట్ మారడం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఖుషి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఉంటే, అది ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద డెబ్యూ అయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఖుషికి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సరసన పాన్ ఇండియా స్థాయిలో లాంచ్ అవ్వడం భారీ అవకాశమయ్యేది. కానీ చివరికి ఆ అదృష్టం జాన్వీకి దక్కింది. మరోవైపు జాన్వీకి కూడా ఇది చాలా కీలకమైన సినిమా కానుంది. దేవరతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఇప్పుడు పెద్దితో మరింత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్- జాన్వీ జోడీపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.

Tags:    

Similar News