డిప్యూటీ సాబ్ పవన్ కు దిల్ రాజు థ్యాంక్స్.. స్పెషల్ ప్రెస్ నోట్ రిలీజ్
అయితే పవన్ ఆదేశాల తర్వాత నిర్మాత దిల్ రాజు స్పందించారు. టాలీవుడ్ పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టికెట్స్ రేట్స్ సహా థియేటర్స్ లో తినుబండారాల విషయంపై పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంత రేట్ కు విక్రయిస్తున్నారు? క్వాలిటీ ఎలా ఉంది? అన్న అంశాలపై పర్యవేక్షించాలని ఆదేశించారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల తాకిడి పెరుగుతుందని చెప్పారు.
అయితే పవన్ ఆదేశాల తర్వాత నిర్మాత దిల్ రాజు స్పందించారు. టాలీవుడ్ పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ కార్యకలాపాలు, ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
"సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం" అంటూ పిలుపునిచ్చారు.
"అలాగే, థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత" అని దిల్ రాజు తెలిపారు.
"ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు" అని దిల్ రాజు చెప్పారు.
"థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము.అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతాం" అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.