అన్ని కష్టాల్లోను ఆయన వెంటే సతీమణి.. ముంబై అంబానీ ఆస్పత్రిలోను!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై నగరానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై నగరానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాలకు సంబంధించిన తీవ్రమైన రొటేటర్ కఫ్ సమస్యతో పాటు కండరాలు పూర్తిగా చిట్లిపోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందాన్ని సంప్రదించి, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆయన అక్కడకు వెళ్లారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన శారీరక ఇబ్బందులను ప్రస్తావిస్తూ, భుజాల కండరాల సమస్య కారణంగా శస్త్రచికిత్సఅవసరమని వైద్యులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ఒకవైపు ప్రభుత్వ సమీక్షలు, ప్రజా పర్యటనలు, మరోవైపు జనసేన పార్టీ వ్యవహారాలు- పెండింగ్ సినీ ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో బిజీగా గడుపుతున్నారు. ఈ నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేని పనిభారం వల్లే ఆయన భుజాల సమస్య మరింత తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్కు గతంలోనూ పలుమార్లు శారీరక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని నెలల క్రితమే ఆయన సైనస్ సమస్య నివారణ కోసం అత్యవసరంగా ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత వెన్నునొప్పి (బ్యాక్ పెయిన్) సమస్య కూడా ఆయనను వేధించింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్న తరుణంలో తీవ్రమైన డిస్క్ పెయిన్ రావడంతో పవన్ కళ్యాణ్ మీటింగ్ మధ్యలోనే నిష్క్రమించి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆయన వెన్నునొప్పితో పాటు భుజాల నొప్పితోనూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టమైంది.
ప్రజాక్షేత్రంలో నిరంతరం చురుగ్గా ఉండే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇటీవల ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల వల్ల దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సమయంలో ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జనసేనాని త్వరగా కోలుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని ఆకాంక్షించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా నిలిచింది.
ప్రస్తుతం ముంబైలో జరగనున్న ఈ వైద్య పరీక్షల రిపోర్టులు అందిన తర్వాత... భుజాల శస్త్రచికిత్స ఎప్పుడు చేయాలనే దానిపై వైద్యులు ఒక స్పష్టమైన నిర్ణయానికి రానున్నారు. కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు ముగిసిన వెంటనే ఆయన తిరిగి మంగళగిరి కి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు తమ ప్రియతమ నాయకుడి ఆరోగ్య పరిస్థితిపై జనసైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజా సేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.