ఎన్టీఆర్-నీల్ సినిమా... ఆమె నుంచి ఫ్యాన్స్కి భరోసా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'వార్ 2' సినిమాతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆ సినిమాతో బాలీవుడ్లో సాలిడ్ ఎంట్రీ ఇస్తాడని ఆశించిన ఫ్యాన్స్కి నిరుత్సాహం తప్పలేదు;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'వార్ 2' సినిమాతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆ సినిమాతో బాలీవుడ్లో సాలిడ్ ఎంట్రీ ఇస్తాడని ఆశించిన ఫ్యాన్స్కి నిరుత్సాహం తప్పలేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వార్ 2 బొక్కబోర్లా పడటంతో ఫ్యాన్స్ దృష్టి అంతా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాపై ఉంది. ఆ సినిమా 2026 సంక్రాంతికి వస్తుందని మొదట ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందని, వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు సమ్మర్లో అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ గాయంతో పాటు స్క్రిప్ట్ విషయంలో ఉన్న విభేదాల కారణంగా మొత్తం ప్రాజెక్ట్ అనుమానంలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్, నీల్ మధ్య విభేదాలు వచ్చాయని, ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సిందే అని ఎన్టీఆర్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగి చాలా రోజులు అయింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది క్లారిటీ లేదు. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా మార్పులు చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రతి రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబంధిత టీంను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఎవరూ స్పందించడం లేదు. ముందు ముందు అయినా డ్రాగన్ సినిమా గురించి అప్డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ భార్య నుంచి క్లారిటీ వచ్చింది. ఆమె పోస్ట్ అభిమానులకు కాస్త భరోసా ఇచ్చినట్లు అయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు కాస్త బ్రేక్ వేసినట్లుగా ఆమె పోస్ట్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి
డ్రాగన్ సినిమా ఎప్పుడు అంటూ కొందరు నెటిజన్స్ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డిని ట్యాగ్ చేసి పోస్ట్లు చేసిన సమయంలో ఆమె స్పందించింది. తనకు వస్తున్న పోస్ట్లకు ఆమె సమాధానంగా... ఎన్టీఆర్-నీల్ మూవీ కచ్చితంగా సరైన సమయంలో వస్తుందని ఆమె భరోసా ఇచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్-నీల్ మూవీ కచ్చితంగా అనుకున్న సమయంలో అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ లేదు, కానీ సెకండ్ హాఫ్ కోసం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని, ఈ ఏడాది చివర్లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా విషయంలో వస్తున్న పుకార్లపై మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక క్లారిటీ రావాలని కోరుకుంటున్న సమయంలో లిఖిత రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
సలార్ 2 కోసం ప్రేక్షకుల ఎదురు చూపులు
కేజీఎఫ్ సినిమాతో కన్నడంతో పాటు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ తో మరోసారి తన సత్తా చాటాడు. సలార్ 2 కోసం ఎదురు చూస్తున్న సమయంలో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్తో మొదలు పెట్టాడు. డ్రాగన్ సినిమా తర్వాత సలార్ 2 వస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రభాస్ సలార్ 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ వస్తున్న వార్తలను ప్రశాంత్ నీల్ అయినా కాస్త క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముందు ముందు అయినా ప్రశాంత్ నీల్ మూవీస్ స్పీడ్గా రావాలని కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ లైనప్ భారీగా ఉన్న విషయం తెల్సిందే. అవి ఎప్పటికీ క్లియర్ అవుతాయో చూడాలి.