నాలుగు గోడల మధ్య నరకం చూడలేక!
బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ మరణానంతరం బార్య నీతూ కపూర్ తిరిగి సినిమాల్లోకి రావడంపై అప్పట్లో సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే;
బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ మరణానంతరం బార్య నీతూ కపూర్ తిరిగి సినిమాల్లోకి రావడంపై అప్పట్లో సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. భర్త చనిపోయిన కొద్ది రోజులకే షూటిం గ్స్లో పాల్గొనడం డ్యాన్స్ షోలలో కనిపించడం పట్ల చాలా విమర్శలే ఎదుర్కున్నారు. అయితే ఈ విమర్శలపై నీతూ కపూర్ ఏనాడు స్పందించలేదు. తాజాగా ఇప్పుడా సమయం రావడంతో నీతూ వాటికి ధీటైన బధులిచ్చారు. భర్త మరణానంతరం ఆ ఒంటరితనాన్ని భరించలేకే తాను పనిలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
రిషి కపూర్ మరణించిన తర్వాత ఇంటి నాలుగు గోడల మధ్య ఉండటం నరకంగా అనిపించిందని నీతూ కపూర్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఖాళీగా ఉంటే భర్త జ్ఞాపకాలు తనను మరింత కృంగదీసేవని దాంతో తాను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించానని చెప్పారు. అందుకే మనసును మళ్లించుకోవడానికి ఆ బాధ నుండి బయటపడటానికి మళ్ళీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పని అనేది తనకు ఒక థెరపీలా పనిచేసిందని అది తనను మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడిందని వివరించారు.
అయితే ఆ విచారకరమైన రోజుల్లో మద్యం అలవాటుకు కూడా లోనయ్యానని నీతూ కపూర్ సంచలన నిజం బయట పెట్టారు. రిషి కపూర్ మరణించిన తర్వాత మొదటి రెండు మూడు నెలలు తాను పూర్తిగా మత్తులోనే గడిపానని, పిల్లలు రణబీర్ , రిద్దిమా పక్కనే ఉన్నా? ఆ శూన్యాన్ని ఏదీ పూడ్చలేకపోయిందన్నారు. రాత్రి పూట నిద్ర రాక పోవడం, భర్తతో గడిపిన క్షణాలు గుర్తుకు రావడం వల్ల ఆ అలవాటును ఆశ్రయించానని కానీ అది సరైన మార్గం కాదని త్వరగానే తెలుసుకున్నానని నిజాయితీగా వెల్లడించారు.
సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ `నేను నవ్వుతున్నానంటే నాకు బాధ లేదని అర్థం కాదు. నాకు నా భర్త అంటే ఎంతో ప్రేమ. కానీ ఆయన లేని జీవితాన్ని గడపడం కూడా నేను నేర్చుకోవాలి` అని ఆమె ధీటుగా బదులిచ్చారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో కూర్చుని ఏడవడం వల్ల ఆ వ్యక్తి తిరిగి రారని బదులుగా మనల్ని మనం నాశనం చేసుకుంటామని అభి ప్రాయపడ్డారు. తనను విమర్శించే వారు తన పరిస్థితిలో ఉంటేనే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆవేదన చెందారు. అలాగే పని పట్ల నీతూ కపూర్ అంకితభావాన్ని చాటారు.
`జుగ్ జుగ్ జీయో` వంటి చిత్రాల్లో నటించడం వల్ల తాను మళ్ళీ సాధారణ జీవితానికి దగ్గరయ్యానని నీతూ చెప్పుకొచ్చారు. రిషీ కపూర్ ఎప్పుడూ తాను సంతోషంగా ఉండాలని కోరుకునేవారని ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాను జీవిస్తున్నానని తెలిపారు. పిల్లలు కూడా తన నిర్ణయాన్ని గౌరవించారని వారు తనను షూటింగ్స్కు వెళ్లమని ప్రోత్సహించారని చెప్పారు. ప్రస్తుతం మనవరాలు రాహాతో గడుపుతూనే అవసరమైనప్పుడు షూటింగ్ లకు వెళ్తున్నానన్నారు.