ఈసారైనా కీరవాణి ఆ విమర్శకు ఫుల్ స్టాప్ పెడతారా?
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎం.ఎం. కీరవాణి పేరు ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా నిలిచింది.;
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎం.ఎం. కీరవాణి పేరు ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా నిలిచింది. మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్, ఎన్నో ఎమోషన్స్ ను మిగిల్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉన్నాయి. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే దానికి సంగీతం అందించేది కీరవాణినే. ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సంగీతపరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అంతేకాదు, RRR సినిమాలోని నాటు నాటు సాంగ్కు అకాడమీ అవార్డు రావడం ద్వారా టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన ఘనత లో కూడా కీరవాణి ముఖ్య పాత్ర పోషించారు.
రాజమౌళి సినిమాలకు బెస్ట్ ఇస్తున్న కీరవాణి
అయితే ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ విషయంలోనైనా ఏదొక కంప్లైంట్ ఉండటం సహజం. అలానే కీరవాణిపై కూడా ఓ విమర్శ రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది. కీరవాణి, రాజమౌళి సినిమాల విషయంలో తీసుకునే శ్రద్ధ, చూపించే నిబద్ధత, ఇతర డైరెక్టర్ల సినిమాల విషయంలో చూపించరని అంటుంటారు. ఒకప్పుడు కీరవాణి నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఎలాంటి పాటలు వస్తాయా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు రాజమౌళి- కీరవాణి కాంబినేషన్ సినిమా అంటేనే ఆ ఆసక్తి ఉంటుంది. మిగిలిన డైరెక్టర్లతో కీరవాణి చేసే సినిమాల నుంచి సాంగ్స్ వచ్చేటప్పుడు ఆ ఆసక్తి కనిపించడం లేదు. గత కొంతకాలంగా వేరే డైరెక్టర్లతో కీరవాణి చేస్తున్న సినిమాల్లో మ్యూజిక్ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన హరి హర వీరమల్లుకు కూడా సరైన సంగీతం ఇవ్వలేకపోయిన కీరవాణి, చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సాంగ్ తో కూడా వావ్ అనిపించలేకపోయారు. దీంతో రాజమౌళి సినిమా అయితేనే కీరవాణి బెస్ట్ ఇస్తారని అందరూ ఫిక్సైపోయారు.
ఈ నేపథ్యంలో కీరవాణి తనపై పడ్డ రిమార్క్ ను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కీరవాణి చేతిలో విశ్వంభర ప్రాజెక్టు ఉండగా, ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ను ఇచ్చి తనపై ఉన్న కంప్లైంట్ ను అందరూ మర్చిపోయేలా చేయాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే కీరవాణి మరో భారీ ప్రాజెక్టుకు మ్యూజిక్ ఇవ్వనున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జై హనుమాన్ కు కీరవాణి సంగీతం
అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రానున్న జై హనుమాన్. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా వారణాసితో బిజీగా ఉన్న కీరవాణి, ఇప్పుడు జై హనుమాన్ లాంటి మరో మైథలాజికల్ ప్రాజెక్టును ఒప్పుకున్నారని వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. హనుమాన్ మూవీలో బీజీఎం ఎంత కీలకపాత్ర పోషించిందో తెలిసిందే. ఇప్పుడు జై హనుమాన్ స్థాయి బాగా పెరగడంతో ఈ సినిమాకు దాన్ని మించిన బీజీఎం ఇవ్వాలి. అసలే కీరవాణిపై తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు తప్ప ఈ మధ్య ఎవరికీ సరైన మ్యూజిక్ ఇవ్వడం లేదనే కంప్లైంట్ ఉంది. మరి ఈ సినిమాకు కీరవాణి ఏ మేర న్యాయం చేస్తారు? జై హనుమాన్ ఛాన్స్ ను వాడుకుని కీరవాణి తనపై ఉన్న విమర్శను పూర్తిగా తుడిచేస్తారా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే జై హనుమాన్ కు కీరవాణి సంగీతం అందించనున్నారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్పించి, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు.
కీరవాణి కెరీర్ ను చూసుకుంటే ఆయనకు భిన్నమైన భావజాలాలను తన మ్యూజిక్ లో చూపించగల సామర్థ్యం ఉంది. ఎమోషన్, భక్తి, వీరత్వం.. ఎలాంటి మూడ్ అయినా ఆయన మ్యూజిక్ లో ఒదిగిపోతుంది. అయితే ప్రస్తుతమున్న విమర్శల నేపథ్యంలో జై హనుమాన్ ఆయనకు ఓ కీలక పరీక్షగా మారే అవకాశముంది. మరి ఈ మూవీతో కీరవాణి తనపై ఉన్న సెలెక్టివ్ ఎఫర్ట్ అనే విమర్శకు ఫుల్స్టాప్ పెట్టి, మళ్లీ తన క్లాసిక్ మార్క్ ను గుర్తుచేస్తారేమో చూడాలి.