ఆరు నెలల్లో 1000 కోట్లు సాధ్యమేనా?
కేవలం ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 1000 కోట్ల వసూళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.;
బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కేవలం ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 1000 కోట్ల వసూళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ, ఇప్పుడు వరుస హిట్లతో మెగా హీరోలు తమ పూర్వ వైభవాన్ని చాటుకుంటున్నారు. సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' వసూళ్లతో సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ వెంటనే సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి స్టామినాను నిరూపించుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కూడా 300 కోట్ల మార్కును అందుకుంది. స్టిల్ ఇంకా వసూళ్ల పరంగా అదే దూకుడు కొనసాగిస్తుంది. లాంగ్ రన్ లో సినిమా 400 కోట్ల మార్క్ ను చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాల ద్వారా మెగా బ్రదర్స్ ఇప్పటికే సుమారు రూ. 650 కోట్ల వసూళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మెగా అభిమానుల కళ్లన్నీ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్ 'పైనే ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి మార్చిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఒకవేళ ఈ సినిమా గనుక మార్చిలోనే థియేటర్లలోకి వస్తే.. సెప్టెంబర్ నుండి మార్చి వరకు అంటే ఆరు నెలల లోపే మెగా హీరోల నుండి మూడు భారీ సినిమాలు వచ్చినట్లవుతుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్' కు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా సునాయాసంగా 350 కోట్ల మార్కును అందుకుంటుంది. దీనితో కలిపి మెగా బ్రదర్స్ ఖాతాలో కేవలం ఆరు నెలల్లోనే రూ. 1000 కోట్ల గ్లోబల్ వసూళ్లు చేరడం ఖాయంగా చెప్పొచ్చ అదే జరిగితే ఇంత తక్కువ సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు..అందులోనూ అన్నదమ్ములు కలిసి ఈ స్థాయి వసూళ్లను సాధించడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు అవుతుంది.
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ వెయ్యి కోట్ల మార్కును చిరు-పవన్ అందుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం పవన్ -చిరంజీవిలు తదుపరి ప్రాజెక్ట్ ల కోసం రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ తదుపరి సినిమా మొదలు కానుంది. ఇప్పటికే స్టోరీ లాక్ చేసి సూరి రెడీగా ఉన్నారు. అలాగే చిరంజీవి బాబి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కించనున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కూడా చిరు పూర్తి చేయాల్సి ఉంది. నాని తో శ్రీకాంత్ తెరకెక్కిస్తోన్న `ది ప్యారడైజ్` నుంచి రిలీవ్ అవ్వగానే చిరు ప్రాజెక్ట్ పై పని చేయనున్నాడు.