1947.. మంచు విష్ణు కల నెరవేరేనా?
ఇదే సమయంలో మంచు విష్ణు తన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చాడు.;
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా విడుదలకు సిద్ధం అయింది. జూన్ 27న తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో విడుదల కాబోతున్న 'కన్నప్ప' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మంచు విష్ణు చురుకుగా పాల్గొంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం అలాగే నార్త్ ఇండియాలోనూ ఈవెంట్స్ నిర్వహించడం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం చేస్తున్నాడు. ఇటీవల కేరళలో కన్నప్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మంచు విష్ణు పాల్గొన్నాడు. గత నెల రోజులుగా మంచు విష్ణు రెగ్యులర్గా మీడియాకు టచ్లో ఉంటూ కన్నప్ప సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. మంచు విష్ణు గత చిత్రాలు వేరు... ఈ సినిమా వేరు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఆసక్తి మరింతగా పెరిగిందటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ సైతం ఉన్నారు. మంచు విష్ణు కన్నప్ప అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ గత దశాబ్ద కాలంగా చెబుతూ వస్తున్నాడు. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ సినిమాను మంచు విష్ణు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అంతా ఊహించినట్టు కాకుండా విభిన్నంగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మంచు విష్ణు తన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన రాబోయే రెండు ప్రాజెక్ట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మొదటగా ఢీ సినిమా సీక్వెల్ కోసం తాను ప్రేక్షకులతో పాటు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆ సీక్వెల్ కోసం దర్శకుడు శ్రీను వైట్లతో సుదీర్ఘ కాలంగా జర్నీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఢీ సీక్వెల్ అనేది రచయితల చేతుల్లో ఉంది. వారు ఎప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తే, ఎప్పుడు దర్శకుడు రెడీ అంటే అప్పుడే తాను షూటింగ్లో పాల్గొంటాను అన్నాడు. ఢీ సినిమా తన కెరీర్లో అత్యంత ప్రాముఖ్యత ఉన్న సినిమా, అంతే కాకుండా తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని కూడా మంచు విష్ణు ఢీ గురించి చెప్పుకొచ్చాడు.
ఢీ సినిమాతో పాటు 1947 టైమ్ పీరియడ్లో ఒక పీరియాడిక్ డ్రామా మూవీని చేయాలని కోరుకుంటున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అంటే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో సాగే కథతో మంచు విష్ణు సినిమాను చేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం మంచి కథను అన్వేషిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మంచు విష్ణు సినిమాల పట్ల ప్రేక్షకుల్లో సానుకూల దృక్పదం నెలకొంది. అందుకే ఆయన కనుక ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగితే కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 1947 నేపథ్యంలో సినిమాను చేయాలి అని కోరుకుంటున్న మంచు విష్ణు కల నెరవేరేనా అనేది కాలమే నిర్ణయించాలి. కన్నప్ప విజయం సాధిస్తే మంచు విష్ణు ఈ కల నెరవేర్చుకునేందుకు గాను ప్రయత్నించే అవకాశాలు ఉంటాయని కొందరు అంటున్నారు.