స్మార్ట్ ఎస్కేప్: ముందే గెస్ చేసిన బంగారం!

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న థియేటర్ల సంక్షోభం నేపథ్యంలో సమంత రూత్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం `మా ఇంటి బంగారం`వాయిదా పడటం హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-05-15 05:27 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న థియేటర్ల సంక్షోభం నేపథ్యంలో సమంత రూత్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం `మా ఇంటి బంగారం`వాయిదా పడటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం మే 14న విడుదల కావాల్సి ఉండగా.. చిత్ర బృందం దీనిని జూన్ 19కి వాయిదా వేసింది. మే నెలలో ఉన్న మంచి వెకేషన్ సీజన్‌ను వదులుకుంటున్నారని మొదట్లో అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినా.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సమంత టీమ్ తీసుకున్నది అత్యంత తెలివైన నిర్ణయమని స్పష్టమవుతోంది. పరిశ్రమలోని సంక్షోభాన్ని ముందే పసిగట్టి `బంగారం` అడుగులు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.




ప్రస్తుతం తెలంగాణలో ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య రెవెన్యూ వాటా విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. అద్దె విధానం కంటే పర్సంటేజీ షేరింగ్ విధానమే ముద్దని థియేటర్ యజమానులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఒకవేళ మే 14న `మా ఇంటి బంగారం` విడుదల చేసి ఉంటే.. ఈ గొడవల వల్ల థియేటర్ల కౌంటింగ్ తగ్గడమే కాకుండా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. ఈ వివాదం వల్ల ఎదురయ్యే నష్టాన్ని ముందే ఊహించి నిర్మాత కం న‌టి అయిన‌ సమంత టీమ్ ఒక మెట్టు వెనక్కి వేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది.

అయితే ఒకవైపు ఈ గొడవలు ఇలా రన్ అవుతుండగానే మరో అరడజను సినిమాలు థియేటర్లలోకి దూకడానికి సిద్ధమవుతున్నాయి. సూర్య నటించిన `వీరభద్రుడు` (మే 14, త‌మిళ‌నాడులో కొన్నిచోట్ల‌ 15 తేదీలు) ఇప్పటికే బాక్సాఫీస్ బరిలోకి దిగగా, `కేడీ ది డెవిల్` (మే 15), `దృశ్యం 3` (మే 21), `అగ్లీ స్టోరీ` (మే 21) వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. వీటితో పాటు మే 22న `రమణి కళ్యాణం`, `పురుషహ` వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. `మా ఇంటి బంగారం` తప్పుకున్న ఈ గ్యాప్‌లో వస్తున్న ఈ చిత్రాల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

వివాదం పరిష్కారం కాకుండానే ఈ అరడజను సినిమాలు విడుదలకు సాహసం చేయడం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఒకవేళ ఎగ్జిబిటర్లు అనూహ్యంగా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అప్పటికే థియేటర్లలో రన్నింగ్‌లో ఉన్న సినిమాలకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇలాంటి పరిశ్రమ గొడవల వల్ల వసూళ్లు దెబ్బతింటే నిర్మాతలకు బోలెడంత లాస్ మిగులుతుంది. ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన మేకర్ల నిర్ణయం సరైనదా కాదా అన్నది థియేటర్లకు వచ్చే ఆడియెన్స్ స్పందనను బట్టి తెలుస్తుంది.

మొత్తానికి టాలీవుడ్ ప్రస్తుత స్థితిని గమనిస్తే మే 24 లోపు విడుదలవుతున్న చిత్రాలకు ఒక రకమైన అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. ఈ క్లిష్ట సమయంలో `మా ఇంటి బంగారం` తనను తాను సురక్షితంగా జూన్ నెలకు మార్చుకుని ఒక `స్మార్ట్ ఎస్కేప్` ప్లాన్ చేసింది. సామ్ తీసుకున్న ఈ నిర్ణయం నష్ట నివారణకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. మిగిలిన సినిమాలు ఈ వివాదాల సుడిగుండంలో ఎలా గట్టెక్కుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News