పవన్తో విభేదాలు.. మరో క్లారిటీ ఇచ్చిన క్రిష్!
ఇటీవల ‘ఘాటి’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న క్రిష్, మళ్లీ ఇదే ప్రశ్న ఎదురవ్వడంతో స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.;
హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన వివాదాలు, ప్రచారం, కలెక్షన్లతో టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మాస్ యాక్షన్ సినిమాల తర్వాత ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేలా పీరియాడిక్ డ్రామాలో నటించడం పవన్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ముఖ్యంగా పెయిడ్ ప్రీమియర్స్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్తో హరిహర వీరమల్లు భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఇంతవరకు పవన్ కళ్యాణ్ తో, దర్శకుడు క్రిష్ విభేదాల కారణంగానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వర్గాల్లో ఈ విషయం మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ వచ్చింది. కానీ సినిమా ప్రమోషన్లలో పవన్ క్లియర్గా క్రిష్ను పొగడడం, మరోవైపు క్రిష్ కూడా మూవీ టీమ్కి బెస్ట్ విషెస్ చెబుతూ, పవన్తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పడం తాజా హాట్ టాపిక్ అయింది.
ఇటీవల ‘ఘాటి’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న క్రిష్, మళ్లీ ఇదే ప్రశ్న ఎదురవ్వడంతో స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. "పవన్ కళ్యాణ్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. వచ్చిన వార్తల్లో నిజం లేదు. అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో ఆయనతో మరో సినిమా చేసేందుకు కూడా సిద్ధమే" అని క్లారిటీ ఇచ్చాడు. క్రియేటివ్ డిఫరెన్స్లు కూడా లేవని స్పష్టం చేశాడు. అంతేకాదు, గతంలో పవన్ కూడా ఒక ఇంటర్వ్యూలో, హరిహర వీరమల్లు కథను విన్నప్పుడు క్రిష్పై చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ మధ్యే పవన్ కళ్యాణ్ కూడా సినిమా రిలీజ్ సందర్భంగా, క్రిష్ వంటి దర్శకుడితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని పాజిటివ్గా వ్యాఖ్యానించారు. అలాగే నిర్మాత ఏఎం రత్నం వల్లే ప్రాజెక్ట్ పూర్తయ్యిందని స్పెషల్గా గుర్తు చేశారు. వీటన్నింటినీ బట్టి, క్రిష్, పవన్ మధ్య విభేదాలూ లేవు, ఎటువంటి నెగటివ్ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని అభిమానులు చెబుతున్నారు.
క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి నటిస్తున్న 'ఘాటి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో సెప్టెంబర్లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. అదే సమయంలో, బాలకృష్ణతో కలిసి అదిత్య 369 సీక్వెల్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.