అంజనాద్రిలో 'జై హనుమాన్'.. అక్కడే ఎందుకు?

అయితే తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధించి.. సుమారు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.;

Update: 2026-02-22 13:18 GMT

బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమైంది. సూపర్‌ హీరో, భక్తి, ఇతిహాసం ఎలిమెంట్స్ తో కూడిన స్టోరీతో రూపొందుతున్న ఆ చిత్రం పూజా కార్యక్రమాలు కర్ణాటకలో హంపి సమీపంలోని పవిత్ర క్షేత్రం అంజనాద్రి బెట్ట వద్ద గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. మూవీ టీమ్ అంతా పాల్గొనగా, ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

అయితే తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధించి.. సుమారు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. భక్తి నేపథ్యంలో సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో తీసిన ఆ సినిమా క్లైమాక్స్‌ లో హనుమంతుడి పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అదే స్టోరీని కాస్త పెంచి, భారీ స్థాయిలో ఇప్పుడు జై హనుమాన్‌ ను రూపొందిస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఆ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ లో భాగంగా వస్తోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన యాత్ర అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో కథ సాగనుందని తెలుస్తోంది. భక్తి, యాక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు పెద్దపీట వేస్తూ ఆ సినిమాను మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి నటించడం విశేషం. ఆయన తన సతీమణితో కలిసి పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక హనుమాన్‌ లో హీరోగా నటించిన తేజ సజ్జా సీక్వెల్‌ లో కూడా హనుమంత్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటి పేరు వినిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

నిర్మాణ బాధ్యతలు మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టింది. భారీ బడ్జెట్‌ తో, మోడ్రన్ టెక్నాలజీతో సినిమాను రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్‌ తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతో దర్శకుడు ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ ను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే అంజనాద్రి బెట్టలో పూజలు నిర్వహించడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. పురాణాల ప్రకారం ఇదే హనుమంతుడు జన్మస్థలం అని విశ్వసిస్తారు.

కొండపై ఉన్న హనుమాన్‌ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 575 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ రాతితో చెక్కిన హనుమంతుడి విగ్రహం, సమీపంలో సీతారాముల ఆలయాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో షూటింగ్‌ ను ప్రారంభించడం ద్వారా సినిమాకు మంచి కలుగుతుందని మేకర్స్ భావించారు! ఏదేమైనా జై హనుమాన్‌ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.





Tags:    

Similar News