హరీష్ ఉస్తాద్.. పవన్, భూమిక మ్యాజిక్ ను మిస్ అయిపోయామా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2026-03-11 18:30 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమాకు మొదట అనుకున్న కథ పూర్తిగా భిన్నంగా ఉండేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఖుషీ మూవీ కంటిన్యూషన్ గా ఉస్తాద్ తీయాలనుకున్నానని తెలిపారు.

పవన్ కెరీర్‌ లో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రం ఖుషీ. ఆ సినిమాలో సిద్ధు- మధు పాత్రల మధ్య కనిపించిన లవ్, ఈగో, గొడవలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ ఇద్దరి మధ్య జరిగే ఈగో క్లాష్లు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్, భూమిక తమ న్యాచురల్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో అలరించారు.

అయితే ఉస్తాద్ కోసం హరీష్ శంకర్ మొదట ఒక కథను సిద్ధం చేశారట. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఆ కథలో ఖుషీలో విడిపోయిన సిద్ధు, మధు ఇద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తారు. కానీ వారిద్దరి మధ్య పాత ఈగో అలాగే ఉంటుంది. దీంతో వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ప్రేమ.. వాటితో స్క్రిప్ట్‌ ను తయారు చేసుకున్నారట.

అంతేకాదు ఖుషి ఫ్లాష్‌ బ్యాక్‌ కు సంబంధించిన కొన్ని రిఫరెన్సులు కూడా కథలో ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే స్టోరీ రెడీ అయిన తర్వాత హరీష్ శంకర్‌ కు ఒక డౌట్ వచ్చిందట. పవన్ వంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరో నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారనే ప్రశ్న ఎదురైంది. అభిమానులు ఎప్పుడూ పవన్ నుంచి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ ఫుల్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్‌ ఆశిస్తారని ఆయన భావించారు.

అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఎమోషన్స్, ఈగో క్లాష్ల చుట్టూ తిరిగే కథ థియేటర్లలో అభిమానులను ఎంతవరకు శాటిస్ఫై చేస్తుందన్న అనుమానం కలిగిందేమో.. మాస్ ప్రేక్షకులు ఆశించే పవర్‌ ఫుల్ ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో తక్కువగా ఉంటాయట. దీంతో రిస్క్ చేయకుండా ఆ కథను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారని హరీష్ శంకర్ తెలిపారు.

ఆ తర్వాత కంప్లీట్ కమర్షియల్ కథను సిద్ధం చేసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో పవన్ పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, అభిమానులను అలరించే డైలాగులు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. అయితే ఒకవేళ మొదట అనుకున్నట్లుగా ఖుషి కథకు కొనసాగింపుగా సినిమా తెరకెక్కి ఉంటే.. పవన్- భూమిక మళ్లీ కలిసి లెక్చరర్లుగా కనిపించి ఉంటే.. ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి కలిగేదేమో అన్న అభిప్రాయం ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతోంది. ఏదేమైనా పవన్, భూమిక మ్యాజిక్ ను మిస్ అయిపోయామని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News