ప్రివ్యూ థియేటర్లో జక్కన్న రచ్చ రచ్చ
థియేటర్ లోకి విచ్చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రేక్షకుల ఆనందం కేరింతలను చూసి ఎంతో ఎగ్జయిట్ అయ్యారు.;
ఒకసారి రిలీజై పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాని, బుల్లితెరపై పదే పదే వీక్షించిన సినిమాని మరోసారి థియేటర్లలోకి తేవడం అంటే చాలా పెద్ద సాహసంగానే పరిగణించాలి. ఈ సినిమా గురించి సర్వం ప్రజలకు తెలుసు. అయినా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి తెస్తున్నారు. 31 అక్టోబర్ రిలీజ్ తేదీ. ఇదంతా ఏ సినిమా గురించో ఈపాటికే మీరు గెస్ చేసి ఉండొచ్చు. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి-1`, `బాహుబలి- 2` రెండు సినిమాలను ఒకే సినిమాగా, మళ్లీ `ది ఎపిక్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు రాజమౌళి- ఆర్కా మీడియా బృందం.
ఈరోజు హైదరాబాద్ ప్రసాద్స్ -పిసిఎక్స్ స్క్రీన్ పై ప్రివ్యూ ప్రదర్శనలో ఫ్యాన్స్ రచ్చ అందరి దృష్టిని ఆకర్షించింది. థియేటర్ లోకి విచ్చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రేక్షకుల ఆనందం కేరింతలను చూసి ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. ఈ ప్రేమే ఈ రోజు ది ఎపిక్ సినిమాని అందించడానికి కారణమని అన్నారు. సినిమా వచ్చి సంవత్సరాలు అయినా కానీ, ఇప్పటికీ అదే ప్రేమను కనబరుస్తున్నారు అని అన్నారు.
మాహిష్మతి సామ్రాజ్యం.. అమరేంద్ర బాహుబలి.. దేవసేన.. రాజమాత శివగామి... బిజ్జల దేవ (నాజర్) పాత్రలను గుర్తు చేసుకుని రాజమౌళి కొంత ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చారు. మాహిష్మతి లో పంటలు ఎలా పండుతున్నాయి? వ్యాపారం ఎలా సాగుతోంది? ఆ ముసలోడు బిజ్జల దేవుడు బతకాలో చావాలో తెలీక అటూ ఇటూ తిరుగుతున్నాడు.. అంటూ రాజమౌళి సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. పదేళ్ల తర్వాత ఎందుకు రిలీజ్ చేసాం అంటే.. దానికి మీ ప్రేమ కారణం.. బాహుబలి గురించి పదే పదే అడుగుతుంటే ఈ రెండు సినిమాలను కలిపి రిలీజ్ చేయాలని భావించామని రాజమౌళి అన్నారు.