'సీతా పయనం' ప్రీరిలీజ్: హ్యాట్సాఫ్! 70 ఎకరాలు అడవికి వదిలేసాడు!!
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రాఘవాపురం గ్రామంలో ఆయన తనకున్న 70 ఎకరాల భూమిని సాగు చేయకుండా.. ప్రకృతికే వదిలేశారు.;
చాలా విసిగించే, విలువైన సమయాన్ని కిల్ చేసే అసందర్భపు ప్రీరిలీజ్ వేడుకలకు భిన్నమైన ఒక ప్రీరిలీజ్ వేడుక ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అది అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన `సీతా పయనం` ప్రీరిలీజ్ వేడుక. ఈ వేదికపై ముగ్గురు రియల్ హీరోలను సన్మానించుకున్న తీరు.. వారి గురించి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ రియల్ హీరోలలో దుశ్చర్ల సత్యనారాయణ ఒకరు. ఆయన కేవలం పర్యావరణ ప్రేమికుడు మాత్రమే కాదు.. అంతకుమించి.. ఆయన సేవలు కేవలం అడవిని పెంచడానికే పరిమితం కాలేదు. ఆయన ఒక పర్యావరణ యోధుడు.. జల సంరక్షకుడు.. సామాజిక కార్యకర్త. ఆయన చేసిన సేవలను ప్రభుత్వాలు సైతం గుర్తించాయి.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రాఘవాపురం గ్రామంలో ఆయన తనకున్న 70 ఎకరాల భూమిని సాగు చేయకుండా.. ప్రకృతికే వదిలేశారు. అక్కడ దాదాపు లక్షకు పైగా చెట్లు ఉన్నాయి. ఇందులో అరుదైన అడవి చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఈ అడవిలో 100కు పైగా జాతుల పక్షులు, వందలాది నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, ఇతర మూగజీవాలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. ఈ అడవిలోకి ఎవరూ వేటకు వెళ్లకూడదు.. ఒక్క పండు కూడా మనుషులు కోయకూడదు. పక్షులు తిని కింద పడేసిన పండ్ల విత్తనాల ద్వారానే ఆ అడవి సహజసిద్ధంగా విస్తరిస్తోంది.
ఆయనను చాలామంది `జలవన సత్యనారాయణ` అని పిలుస్తారు. నీటి సంరక్షణపై ఆయనకు అపారమైన అవగాహన ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న చెరువులు, కుంటలను బాగు చేయడానికి ఆయన ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే గాక కలుషితమవుతున్న మూసీ నదిని రక్షించాలని, మురికి నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయాలని అనేక ఉద్యమాలు చేపట్టారు. తన 70 ఎకరాల అడవిలో చిన్న చిన్న కుంటలు తవ్వి, ఒక్క చుక్క వర్షపు నీరు కూడా బయటకు పోకుండా భూమిలోకి ఇంకేలా చేశారు. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల భూగర్భ జల మట్టం పెరిగింది.
ఆయన ఆధునికతకు దూరం. ఆయన గత 30-40 ఏళ్లుగా చెప్పులు ధరించరు. ప్రకృతితో మమేకమై నడవాలనేది ఆయన ఉద్దేశం. ఆయన తన పనులను ఎప్పుడూ ప్రచారం కోసం చేయలేదు. ఒక జ్ఞానిలా, ఒక మునిలా ప్రకృతి సేవలోనే గడుపుతుంటారు.
ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం, అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయనను గౌరవించాయి. తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యంగా `జలవనం` పేరుతో ఆయన చేసిన కృషిపై అనేక డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.
`సీతా పయనం` వంటి ప్రీరిలీజ్ వేదికలపై ఆయనను సన్మానించడం వల్ల నేటి తరానికి పర్యావరణం ప్రాముఖ్యత తెలిసింది. ``మనం ప్రకృతిని కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది`` అనే సూత్రాన్ని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. దుశ్చర్ల సత్యనారాయణ లాంటి వ్యక్తులు మన మధ్య ఉండటం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఆయన సేవలను గుర్తించి శ్రీరామ ఫిల్మ్స్ వారు చేసిన ఈ సన్మానం నిజంగా అభినందించకుండా ఉండలేం. సీతా పయనం వేదికపై ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో సునామీలా వైరల్ అవుతోంది. ఆయన స్పీచ్ ఆద్యంతం పంచభూతాలను కాపాడాలనే జిజ్ఞాస, ఆత్రం హృదయాలను గెలుచుకుంది.