మన శంకరవర ప్రసాద్‌ గారి 'విశ్వంభర' కొత్త వార్త..!

ప్రస్తుతం చిరంజీవి మన శంకరవర ప్రసాద్‌ గారు బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తున్న సమయంలోనే ఇప్పటికే పూర్తి అయిన 'విశ్వంభర' సినిమా గురించి ఆసక్తికరంగా మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2026-01-29 05:29 GMT

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక భారీ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని 'మన శంకరవర ప్రసాద్‌ గారు' సినిమాతో దక్కించుకున్నారు. ఇప్పటికే సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేప్పటికి సినిమా కచ్చితంగా రూ.400 కోట్ల మార్క్‌ ను టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో పాటు, పోటీగా వచ్చిన సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఫైనల్‌ రన్‌ ను ముగించుకున్నాయి. దాంతో ఈ సినిమాకు పోటీ లేకుండా పోయింది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. ప్రస్తుతం చిరంజీవి మన శంకరవర ప్రసాద్‌ గారు బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తున్న సమయంలోనే ఇప్పటికే పూర్తి అయిన 'విశ్వంభర' సినిమా గురించి ఆసక్తికరంగా మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమా విశ్వంభర...

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే అంటూ విశ్వంభర గురించి మొదటి నుంచి తెగ ప్రచారం చేస్తూ వచ్చారు. 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన విశ్వంభర సినిమా మరీ ఎక్కువ ఆలస్యం అయ్యింది, ఇంకా అవుతూనే ఉంది. ఎక్కబోయే రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఒక సామెత ఉంటుంది, ఆ సామెత ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందేమో అని మెగా అభిమానులు విసుగు చెందుతున్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌ లో ఆసక్తి తగ్గింది. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో జాప్యం జరుగుతుంది అనే వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఏదో జరుగుతుంది అనేది కొందరి అనుమానం. ఆ విషయాన్ని పక్కన పెడితే 2026 సమ్మర్‌ లో కూడా విశ్వంభర సినిమాను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో..

'విశ్వంభర' సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే ఆయన్ను పక్కన పెట్టి మెగా కాంపౌండ్‌ కి, నిర్మాణ సంస్థకు సన్నిహితంగా ఉండే ఒక దర్శకుడికి బాధ్యతలు అప్పగించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దర్శకుడు వశిష్ట మాత్రం ఆ పుకార్లను కొట్టి పారేస్తున్నాడు. ఆ మధ్య అన్ని మీడియా సంస్థలకు వశిష్ట ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా విశ్వంభర ఇంకా తన చేతిలోనే ఉంది అని చెప్పకనే చెప్పాడు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే సినిమాను విడుదల చేస్తామని, విడుదలకు అంతా సిద్ధంగా ఉన్నామని అన్నాడు. షూటింగ్‌ సకాలంలో పూర్తి చేసినప్పటికీ గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండటం, చాలా లోకాలను చూపించే ప్రయత్నం చేయడం వల్ల ఆలస్యం అవుతుంది అని దర్శకుడు స్వయంగా మీడియాతో మాట్లాడిన సమయంలో చెప్పుకొచ్చాడు.

మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమా తర్వాత...

చిరంజీవి విశ్వంభర సినిమా కథ పై నమ్మకంతో వశిష్ట చెప్పిన వెంటనే ఓకే చెప్పాడట. సినిమాలో పలువురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారని, మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష కనిపించబోతుంది. చిరంజీవి చెల్లెలు పాత్రల్లో పలువురు చిన్న హీరోయిన్స్‌ సైతం నటించారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సాంగ్‌ ను రూపొందించడం జరిగింది. సినిమాకు అది ప్రత్యేక ఆకర్షణ అవుతుందని కూడా దర్శకుడు నమ్మకంగా ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా కు కీరవాణి సంగీతాన్ని అందించాడు. సినిమాను 2026 సమ్మర్‌ బరిలో నిలపాలని భావించినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్‌ పూర్తి కాని కారణంగా ఇదే ఏడాది ద్వితీయార్థంకు వాయిదా వేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. కాస్త అటు ఇటుగా దసరాకు సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు విశ్వంభర థియేట్రికల్‌ రిలీజ్ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంకరవర ప్రసాద్‌ గారు బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అయినా అదృష్టం కలిసి రాక విశ్వంభర వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News