ఆ ప్రచారం అబద్ధం : మోహన్ బాబు

Update: 2021-01-17 14:25 GMT
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'సన్నాఫ్‌ ఇండియా' అనే చిత్రం తెరకెక్కుతోంది. గత ఆగష్టు 15న ఈ సినిమాను ప్రకటించింది యూనిట్. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

చాలా కాలం తర్వాత మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకు ఈ చిత్రంలో ఆమె స్టైలింగ్‌ చేయనున్నారు.

అయితే.. మోహన్ బాబు ఈ సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటించబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మోహన్ బాబు తన చిరకాల మిత్రుడు చిరంజీవిని 'ఆచార్య' సెట్లో కలిశారు. తనయుడు విష్ణు కూడా మెగాస్టార్ ను కలిశారు. దీంతో.. మోహన్ బాబు ఆచార్యలో నటిస్తున్నారనే గాసిప్స్ వచ్చాయి.

ఈ ప్రచారంపై మోహన్ బాబు టీం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి 'సన్నాఫ్ ఇండియా' చిత్రంలో తప్ప మోహన్ బాబు మరే చిత్రంలోనూ నటించట్లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ సైన్ చేయలేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే.. తామే వెల్లడిస్తామని తెలిపింది మోహన్ బాబు టీం. దీంతో.. అన్ని ఊహాగానాలకు తెరపడినట్లైంది.
Tags:    

Similar News