ఆ ఎమ్మెల్యే పై ఉమ్మేయాలన్న టాలీవుడ్ హీరో

Update: 2017-11-24 04:44 GMT
పద్మావతి సినిమా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఆ కథతో సంబంధం లేని ప్రాంతాల్లోనూ అది స్థాయికి మించి వివాదంగా మారుతోంది. ఇప్పటికే పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విడుదలకు ముందే నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆ సినిమాపై హైదరాబాద్‌లోనూ రచ్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ దీనిపై ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ సినిమా విడుదలైతే తన నియోజకవర్గంలో ఆడనివ్వబోనని హెచ్చరించారు. తాజాగా ఆ సినిమాను నిషేధించాలని కోరుతూ ర్యాలీ కూడా తీశారు. అయితే... ఆయన రీసెంటుగా ఓ చర్చావేదికలో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఫిలిం ఇండస్ర్టీకి చెందిన మహిళలు రోజుకో భర్తను మారుస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తీవ్రంగా ఆగ్రహించారు. ఇలాంటి వ్యాఖ్యలుచేసిన రాజాసింగ్ పై ఆయన ఇంట్లోని మహిళలే ఉమ్మేయాలంటూ ట్వీట్ చేశారు.

 అయితే... బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సుధీర్ బాబు అంత తీవ్రంగా స్పందించినా కూడా ఇతర టాలీవుడ్ నటులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. మహిళలను అంతలా కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలపై కనీసం తెలుగు సినీ రంగానికి చెందిన మహిళలు కూడా ఖండించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సుధీర్ బాబు స్పందనకు మద్దతు పలుకుతున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అదేసమయంలో మిగతా టాలీవుడ్ దీనిపై ఏమాత్రం స్పందించకపోవడాన్నీ తప్పు పడుతున్నారు.

 ‘‘రాజా సింగ్.. సిగ్గు.. సిగ్గు.. మహిళలంటే నీకున్న అభిప్రాయం ఇదా. నీ ఇంట్లోని ఆడవాళ్లే నీపై ఉమ్మేయాలి’’ అంటూ సుధీర్ బాబు చేసిన ట్వీట్ ను పలువురు రీట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు... పొరుగునే ఉన్న తమిళనాడుకు చెందిన నటులు కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ వంటివారు అనేక అంశాలపై ప్రభుత్వాలను, ఆకృత్యాలను ప్రశ్నిస్తుంటే తెలుగు నటులు మాత్రం ఏం జరుగుతున్నా... చివరకు తెలుగు సినీ మహిళలను కామెంట్ చేసినా స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News