సాయిధరమ్ తేజ్ మారిపోయాడు

Update: 2018-10-15 12:14 GMT
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాడు. తన ఫెయిల్యూర్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా డిజాస్టర్ కావడంతో తేజు అప్పట్నుంచి అదృశ్యం అయిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ మీడియాలో కనిపించాడు. ఈ రోజు సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగానే అతడి కొత్త సినిమా ‘చిత్రలహరి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. తేజు ఈ సినిమా కోసం అవతారం మార్చేస్తున్నట్లే ఉన్నాడు.

కెరీర్లో ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డంతో కనిపించాడతను. ఇంతకుముందు ‘నక్షత్రం’ సినిమాలో కొంచెం గడ్డంతో దర్శనమిచ్చాడు తేజు. ఈసారి మాత్రం గడ్డం బాగా పెంచాడు. ఈ చిత్రాన్ని ‘నేను శైలజ’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించనున్నాడు. ఆ రెండు సినిమాల్లోనూ కిషోర్.. హీరో రామ్ ను కొన్ని సన్నివేశాల్లో గడ్డంతో చూపించాడు. ఇప్పుడు సినిమా మొత్తంలో తేజును గడ్డంతో చూపించేలా ఉన్నాడు. కిషోర్ సైతం ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.

తన కొత్త సినిమా కోసం తేజు లుక్ మార్చుకుంటున్నట్లు.. మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. దీంతో అతడి అభిమానులు కొంచెం ఉత్కంఠగా ఎదురు చూశారు. వరుసగా ఆరు డిజాస్టర్లు ఎదురైన నేపథ్యంలో తేజు కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. అతడికిప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు అవసరం. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని టేకప్ చేయడంతో తేజు రాత మారుతుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిజానికి నాని చేయాల్సింది. కానీ అతను తప్పుకోవడంతో తేజు చేతికి వచ్చింది. మరి ‘చిత్ర లహరి’ అయినా అతడి కెరీర్ ను మారుస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News