అందుకే ఎన్టీఆర్ బయోపిక్ కు నో చెప్పాను: ఆర్జీవీ

Update: 2019-02-19 05:15 GMT
సంక్రాంతి సీజన్ సినిమాల బాక్స్ ఆఫీస్ ఫన్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందోగానీ ఆ సీజన్ అయిన తర్వాత మాత్రం అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల అయ్యే సరికి జనాల ఫోకస్ అంతా ఈ సినిమాపైనే.  ఈ సినిమా ట్రైలర్ కు యూట్యూబ్ లో వస్తున్న స్పందన అదే విషయాన్ని తెలుపుతోంది.  అంతా బాగానే ఉంది కానీ అసలు బాలయ్య టేకప్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేసే అవకాశం మొదట వర్మకు వచ్చిందని అన్నారు.  కానీ ఆది తేజ వద్దకు వెళ్లి ఫైనల్ గా క్రిష్ చేతికి వచ్చింది. మరి వర్మ విషయం లో ఏం జరిగింది?

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్ పై మాట్లాడుతూ "మీరు మహాత్మా గాంధి జీవితం తీసుకొని అయన బ్రిటిషర్లతో చేసిన ఫైట్ ను సినిమాలో చూపించలేదనుకోండి.. ఆ బయోపిక్ తీసి లాభం లేదు.  అలాగే ఒక పెద్ద స్టార్ గా ఎన్టీఆర్ ఎదగడంలో కొన్ని సంఘటనలు మాత్రమే ఉన్నాయి. కానీ అసలు డ్రామా అనేది లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన తర్వాతే మొదలైంది.  ఆ ఎపిసోడ్ ను చూపకుండా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే ఏం లాభం?..  అందుకే నేను వారికి 'నో' చెప్పాను." 

బాలకృష్ణ గారు మీకు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వలేదని కోపంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను టేకప్ చేశారా? అని అడిగితే.. "అలాంటి పనులు చేయడానికి నేనేమీ పిచ్చోడిని కాదు. ఎన్టీఆర్ ఒక పబ్లిక్ ఫిగర్.. ఎవరైనా అయనపై సినిమా తీయొచ్చు.  నేను మాత్రం ఆయన జీవితంలోని జరిగిన.. అందరికీ తెలియని అంశాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాను" అన్నాడు.  వర్మ ఊపు చూస్తుంటే ఈ సారి గట్టిగా కొట్టేలా మాత్రం ఉన్నాడు. 
Tags:    

Similar News