పాండిరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్!

Update: 2021-11-25 08:52 GMT
రజనీకాంత్ తాజా చిత్రంగా ఈ దీపావళికి 'అన్నాత్తే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచే అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా భారీస్థాయిలో విడుదలైంది. 'పెద్దన్న' పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక రజనీ ఇలాకా అయిన తమిళనాట కూడా ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టించలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే భారీ ఫ్లాప్ గా నిలిచింది.

అప్పటివరకూ అజిత్ హీరోగా ఆయనకి అరడజను హిట్లు ఇచ్చిన శివ, ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక రజనీ కథానాయికగా నయనతార సదండి చేయడం .. గతంలో రజనీతో కలిసి కనువిందు చేసిన ఖుష్బూ .. మీనాలు మళ్లీ ఇంతకాలానికి ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేశ్ కీలకమైన చెల్లెలు పాత్రను పోషించడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణలుగా నిలిచాయి. కానీ ఇవేవీ హిట్టును పట్టుకురాలేకపోయాయి.

అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను ఈ సినిమా నష్టాలను తెచ్చిపెట్టింది. దాంతో ఇక ఇప్పట్లో సన్ పిక్చర్స్ - రజనీ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ విశేషమేమిటంటే సన్ పిక్చర్స్ మరో సినిమా కోసం రజనీని సంప్రదించడం .. ఆయన సైన్ చేయడం చాలా ఫాస్టుగా జరిగిపోయాయి.

ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. మొదటి నుంచి కూడా పాండిరాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సూర్య .. కార్తీ .. విశాల్ .. శింబు .. శివకార్తికేయన్ లతో ఇంతవరకూ సినిమాలు చేశాడు.

ప్రస్తుతం ఆయన సూర్యతో మరోసారి చేసిన సినిమా ఫిబ్రవరిలో విడుదలకి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వినిపించిన కథ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఇక 'అన్నాత్తే' తరువాత దర్శకుడు శివతో మరో సినిమా చేయడానికి కూడా రజనీ ఒప్పుకున్నారట. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్టుగా చెప్పుకుంటున్నారు. హిట్టే అవ్వనీ .. ఫట్టే కానీ .. రజనీ స్పీడ్ లో మాత్రం మార్పురాదంతే!



Tags:    

Similar News