టీజర్: 'పంచతంత్రం' కథలతో తిరిగొచ్చిన బ్రహ్మీ - కలర్స్ స్వాతి..!

Update: 2021-10-13 08:45 GMT
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం - కలర్స్ స్వాతి రెడ్డి - సముద్రఖని - రాహుల్‌ విజయ్‌ - శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ''పంచతంత్రం''. కొత్త దర్శకుడు హ‌ర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం చిత్ర టీజర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

''అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు.. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పే బాహుబలి కథలు వినటానికి వచ్చిన వాటికి, మైక్‌ దగ్గర ఓ ముసలి తాబేలు కనిపించింది. కదల డానికి కష్టపడే నువ్వేం కథలు చెప్తావని అడగ్గా.. జవాబుగా ఆకాశమంత అనుభవంతో కథలు మొదలయ్యాయి.. అన్నీ మన కథలే. నిన్ను కన్నవాళ్ళతో నీకు.. నీ లైఫ్ పార్టనర్ తో నీకు.. నువ్వు కన్నవాళ్ళతో నీకు.. ఈ ప్రపంచంతో నీకు.. నీతో నీకుండే కథలు'' అంటూ హీరో సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌ తో వచ్చిన 'పంచ తంత్రం' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు.. నిత్యం మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ''పంచతంత్రం'' చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. అలానే చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం చేసిన పూర్తి స్థాయి సినిమా. ఇందులో నరేష్‌ అగస్త్య - దివ్య దృష్టి - ఉత్తేజ్ - ఆదర్శ్ బాలకృష్ణ - వికాస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టికెట్‌ ఫ్యాక్టరీ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై అఖిలేష్‌ వర్ధన్‌ - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం 'పంచతంత్రం' చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహారి ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్‌ కె నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.




Full View
Tags:    

Similar News