ఆవేదనలోనే ఎన్టీఆర్ ఆరాతీస్తున్నారట?

Update: 2016-08-26 12:28 GMT
టాలీవుడ్ ని ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం పవన్ ఫ్యాన్ వినోద్ హత్య! అది ఒకెత్తు అయితే.. ఈ హత్యను మరో టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పబడటం మరో ఎత్తు. దీంతో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ జనాల్లోనూ - తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది హాట్ టాపిక్. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తి పవన్ ఫ్యాన్ అని నిర్ధారించబడడంతో పవన్ కల్యాణ్ తిరుపతిలో మరణించిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం.. ఈ కేసుపై సీబీఐ విచారణ కూడా కోరతామని తెలపడం తెలిసిందే.

అయితే ఇప్పుడు సమస్య అంతా జూనియర్ ఎన్టీఆర్ దే. ఎందుకంటే.. ఒక వ్యక్తిగా, అత్యధిక సంఖ్యలో అభిమానులున్న నటుడిగా ఎన్టీఆర్ పరిస్థితి అర్ధమవుతుంది. హత్య జరిగిన మాట వాస్తవమే.. అది కూడా తన తోటి నటుడికి సంబందించిన అభిమాని కావడం కూడా ఆ ఆవేదనను మరింతగా పెంచేదే.. అయితే ఈ విషయాలపై ఎన్టీఆర్ నేరుగా స్పందించలేని పరిస్థితి. దీంతో జూనియర్ ఈ విషయాలపై తీవ్ర మనస్థాపం చెందాడట. అసలు వినోద్ మృతికి కారకుడయినవాడు తన అభిమానేనా లేక చేసిన వెదవపనికి ఈ పేరు వాడుకుంటే మరో వర్గం నుంచి నైతిక మద్దతు లభిస్తుందనే భ్రమతో ప్లాన్ చేశాడా అనే ప్రశ్నలు అన్నివైపుల నుంచీ ఎదురవుతున్నాయట. దీంతో ఈ వ్యవహరంపై ఎన్టీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సమాచారం.

అయితే ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై మౌనంగా ఉండటమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై వెనకా ముందూ ఆలోచించకుండా ఆయన వెంటనే స్పందించి తిరుపతి వెళ్ళినా, మీడియాలో స్టేట్ మెంట్స్ ఇచ్చినా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండేవనడంలో సందేహం లేదు. దీంతో అన్నిరకాలుగా ఆలోచించి మౌనంగా ఉన్న జూనియర్... అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరు చేసిన పని, కారణాలు ఏమై ఉన్నాయి.. అసలు ఆ హత్యకు పాల్పడ్డాడు అని చెబుతున్న వ్యక్తి తన అభిమానుల్లో ఒకరేనా... ఇలా ఎన్నో అంశాలపై ఆరాతీస్తున్నారట.

మరణించిన పవన్ అభిమాని విషయంపై యంగ్ టైగర్ చాలా బాధపడ్డాడని అభిమానులు చెబుతున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు రావటం అనేదే ఏ హీరో కూడా ఎంకరేజ్ చేయరు. అలాంటిది ఆ గొడవలు చంపుకునే వరకూ రావటం అనేది శోచనీయమే. అయితే ఈ విషయంపై  ఎన్టీఆర్ ఫ్యాన్స్ సమగ్ర నివేధికను హీరోకి అందజేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారట.
Tags:    

Similar News