'యాక్షన్' అనే పదం విని మూడేళ్లు అయ్యింది!!

Update: 2020-04-11 08:30 GMT
మంచు మనోజ్ సామాజిక అంశాలపై స్పందించడానికి ఎప్పుడూ ముందుంటాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం అందించి సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. సినిమాలతో తక్కువగా పలకరించే మంచు మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ ప్రతి విషయానికి తనదైన కోణంలో సోషల్ మీడియాలో స్పందించే మంచు మనోజ్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ఎన్నో విధాలుగా హెచ్చరికలు - జాగ్రత్తలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఒక‌ప్పుడు మంచి సినిమాల‌తో అల‌రించిన మంచు మ‌నోజ్ కొంత కాలంగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు. దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆయ‌న మ‌ళ్ళీ 'అహం బ్రహ్మాస్మి' సినిమాతో అభిమానులను పలకరించడానికి సిద్ధ‌మ‌య్యారు. కాని క‌రోనా కార‌ణంగా ఈ సినిమా ఆగిపోయింది. దీంతో త‌న అభిమానుల‌ని అల‌రించేందుకు మ‌నోజ్ తాను పాడిన పాట‌ని యూ ట్యూబ్ ద్వారా విడుద‌ల చేస్తాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా చెప్పుకొచ్చాడు.

'మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమా తో మిమ్మల్ని పలుకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. "యాక్షన్" అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు - పోలీసులకు - ఆర్మీకి - పారిశుధ్య కార్మికులకు - ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు సంగీత సార‌ధ్యంలో "అంతా బాగుంటాం రా" అని నేను - నా మేనకోడలు విద్యా నిర్వాణ  కలిసి పాడి - పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది... ఇప్పటికే చాలా వాటికోసం ఎదురు చూస్తున్నారు. కష్టం అయినా వచ్చే వారం వరకూ ఆగండి' అని మ‌నోజ్ త‌న ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండ‌గా నిలిచేందుకు  మంచు ఫ్యామిలీ ఏపీలోని చిత్తూరు జిల్లాలో 8 గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ సెలెబ్రెటీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇలాంటి కష్ట సమయాల్లో ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం.



Tags:    

Similar News