గోపి సుందర్ కు ట్రబుల్ తప్పదా?

Update: 2019-04-17 17:10 GMT
నాగచైతన్య హీరోగా.. సమంతా.. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'మజిలీ' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 5 వ తారీఖున విడుదలైన ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి వసూళ్లను నమోదు చేస్తోంది.  అయితే ఈ సినిమా నిర్మాతలు సాహు గారపాటి.. హరీష్ పెద్ది సంగీత దర్శకుడి విషయంలో ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట.

'మజిలీ' సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు.  కానీ ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందుగా గోపి సుందర్ వ్యక్తిగత కారణాలవల్ల తప్పుకున్నాడట.  అప్పటికే నేపథ్య సంగీతం ఇంకా పెండింగ్ ఉందట.  అది కంప్లీట్ చేయాలని నిర్మాతలు కోరడంతో కాస్త ఎక్కువ సమయం అడిగాడట.  కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనుక డిలే అయితే సినిమా విడుదల వాయిదా పడుతుందని భావించిన నిర్మాతలు తప్పనిసరి పరిస్థితులలో థమన్ ను సంప్రదించారట.  అసలే థమన్ జెట్ స్పీడ్ తో పనిచేస్తాడు. 'మజిలీ' మేకర్స్ కు ఏమాత్రం టెన్షన్ లేకుండా మంచి క్వాలిటీతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి ఇవ్వడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఎదురవలేదు. 

నిర్మాతలు గోపిసుందర్ కు పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డారు. పైగా థమన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినందుకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సివచ్చింది.  దీంతో గోపి సుందర్ పై ఛాంబర్ లో నిర్మాతలు ఫిర్యాదు చేయాలనుకున్నారట.  కానీ సినిమా రిలీజ్ కు ముందు అలా ఫిర్యాదు చేస్తే లేనిపోని నెగెటివిటి  ఉంటుందనే ఆలోచనతో మిన్నకుండిపోయారట. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది..హిట్ అయింది కాబట్టి గోపి సుందర్ పై కంప్లయింట్ చేసేఆలోచనలో ఉన్నారట. మరి ఈ అంశంపై గోపి సుందర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.  ఈ వివాదంలో నిర్మాతలతో రాజీ చేసుకోకపోతే గోపికి ట్రబుల్ తప్పేలా లేదు.
  


Tags:    

Similar News