నా కూతుర్ని మణిరత్నం చేతుల్లో పెట్టేస్తా

Update: 2017-07-23 07:03 GMT
మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదని భావిస్తారు దక్షిణాది సినీ తారలు. కెరీర్లో ఒక్కసారైనా మణిరత్నంతో పని చేస్తే ఆ అనుభవమే వేరని.. తెరపై తమను తాము కొత్తగా చూసుకోవచ్చని.. నటన విషయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చిని అంతా అనుకుంటూ ఉంటారు. అరవింద్ స్వామి.. మధుబాల.. ఐశ్వర్యారాయ్.. మాధవన్.. ఇలా ఎంతోమంది మణిరత్నం స్కూల్ నుంచి వచ్చి గొప్ప స్థాయిని అందుకున్నారు. అందుకే తన కూతుర్ని కూడా ఆయన చేతికే అప్పగించాలని చూస్తోంది మధుబాల. మణిరత్నం ‘రోజా’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ సంపాదించి.. మంచి స్థాయికి చేరుకున్న మధుబాల.. తన కూతురి బాధ్యత కూడా మణిరత్నమే తీసుకోవాలంటోంది.

మధుబాలకు అమియా.. కియా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. 16 ఏళ్ల అమియాకు నటన అంటే చాలా ఇష్టమట. తల్లి బాటలోనే సినిమాల్లోకి రావలనుంటోందట. ఐతే ఆమె సినిమాలకు పనికొస్తుందా లేదా అన్నది మణిరత్నమే తేల్చాలని అంటోంది మధుబాల. ఆయన కంటే బాగా ఈ విషయంలో జడ్జ్ చేసేవాళ్లు ఇంకెవరూ లేరని ఆమె అభిప్రాయపడింది. త్వరలోనే మణిరత్నంను కలుస్తానని.. ‘నా కూతురి జీవితాన్ని మీ చేతుల్లో పెడతా. ఇక మీరే చూసుకోవాలి. టాలెంట్ ఉంటే నటిగా తీర్చిదిద్దండి’ అని ఆయనకు చెప్పేస్తానని.. అంత వరకే తన పని అని.. అమియాకు టాలెంట్.. అదృష్టం ఉంటే సినిమాల్లో రాణిస్తుందని మధుబాల చెప్పింది. సినీ పరిశ్రమలో కేవలం బ్యాగ్రౌండ్ ఉంటే సరిపోదని.. సొంత టాలెంట్ లేకుండా.. అదృష్టం కలిసి రాకుండా ఎవరూ రాణించలేరని మధుబాల అభిప్రాయపడింది.
Tags:    

Similar News