రెండేళ్ల వివాదంకు ఫుల్‌ స్టాప్‌..!

Update: 2018-11-02 10:21 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ మరియ బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ మద్య 2016 నుండి వివాదం నడుస్తోంది. అప్పటి నుండి వీరిద్దరు కూడా ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉంటున్నారు. 2016 సంవత్సరంలో అజయ్‌ దేవగన్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘శివాయ్‌’ చిత్రం మరియు కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రాలు ఒకేసారి విడుదల అయ్యాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. శివాయ్‌ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ రాగా యే దిల్‌ హై ముష్కిల్‌ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

హిందీ మూవీ క్రిటిక్‌ కమాల్‌ రషీద్‌ తో కావాలని శివాయ్‌ చిత్రానికి కరణ్‌ జోహార్‌ నెగటివ్‌ ప్రచారం చేయించాడని - అందుకోసం 25 లక్షల రూపాయలను కూడా కరణ్‌ ఖర్చు చేశాడు అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. స్వయంగా అజయ్‌ దేవగన్‌ కూడా కరణ్‌ జోహార్‌ తన సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చేలా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం - అజయ్‌ దేవగన్‌ విమర్శలను ఆయన భార్య కాజోల్‌ కూడా సమర్ధించడం వంటి కారణాల వల్ల కరణ్‌ జోహార్‌ వారికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

కరణ్‌ జోహార్‌ పలు వేదికలపై కూడా అజయ్‌ దేవగన్‌ తో తనకు విభేదాలు ఉన్నాయని అన్నాడు. అయితే ఆయన భార్య కాజోల్‌ మాత్రం తనకు మంచి స్నేహితురాలు అంటూ పేర్కొన్నాడు. తాజాగా వీరిద్దరు కలవబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ లో వీరిద్దరు కలిసి ఒక చిత్రం చేసేందుకు సిద్దం అవుతున్నారట. రెండు సంవత్సరాల విభేదాలను పక్కన పెట్టి వీరిద్దరు కలిసి పని చేయబోతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. దీపావళి సందర్బంగా వీరిద్దరు కలిసి ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News