ధనుష్ మోసం చేశాడంటున్న కాజోల్

Update: 2017-06-26 13:02 GMT
హెడ్డింగ్ చూస్తే ఇదేదో పెద్ద వివాదంలా కనిపిస్తోంది కదా? నిన్న ముంబయిలో ‘వీఐపీ-2’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తన ప్రసంగాన్ని అలాగే మొదలుపెట్టింది కాజోల్. ఆమె సీరియస్ గా ధనుష్.. అతడి మరదలు.. ‘వీఐపీ-2’ దర్శకురాలు సౌందర్య తనను మోసం చేశారని అనేసరికి అందరూ అలెర్టయిపోయారు. కానీ తర్వాత కాజోల్ చేసిన తమాషా చూసి అందరూ ముసి ముసిగా నవ్వుకున్నారు. ధనుష్.. సౌందర్య ‘వీఐపీ-2’లో తన పాత్రకు తమిళంలో డైలాగులు చెప్పాల్సిన అవసరం పెద్దగా ఉండదని చెప్పి తననా పాత్రకు ఒప్పించారని.. కానీ తర్వాత చూస్తే బారెడు తమిళ డైలాగులు చెప్పించారని చెప్పింది కాజోల్.

తనకు హిందీ తప్ప వేరే భాష ఏమీ మాట్లాడటం రాదని.. ఐతే ధనుష్.. సౌందర్య తనకు ‘వీఐపీ-2’ గురించి చెప్పినపుడు అబద్ధం చెప్పారని కాజోల్ చెప్పింది. ఈ సినిమాలో తాను తమిళంలో మాట్లాడాల్సిన అవసరం లేదని.. తమిళ డైలాగులు చెప్పాల్సిన పనిలేదని అన్నారని.. అదంతా ఒట్టి మాటేనని తొలి రోజు షూటింగ్‌ లోనే తెలిసిపోయిందని చెప్పింది. రెండు సీన్లకు సంబంధించి తనకు స్క్రిప్టు పేపర్ ఇచ్చారని.. అందులో పెద్ద పెద్ద తమిళ డైలాలుండటం చూసి కంగు తినడం తన వంతైందని కాజల్ తెలిపింది. ఆ డైలాగ్స్ చూడగానే తనకు భయమేసిందని.. ఐతే ఆ డైలాగుల్ని ఎలాగోలా చెప్పే ప్రయత్నం చేయండంటూ సింపుల్ గా చెప్పేశారని కాజోల్ వివరించింది. ఇది మోసం అని.. ఐతే ఎలాగోలా తనతో తమిళ డైలాగులు చెప్పించిన ఘనత మాత్రం ధనుష్.. సౌందర్యలదే అని కాజోల్ చెప్పింది. 90ల చివర్లో తమిళంలో ‘మిన్సార కనవు’ (మెరుపు కలలు) సినిమా చేసిన కాజోల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ భాషలో ‘వీఐపీ-2’ చేసింది. ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News