మీడియాపై జీవిత కూడా..

Update: 2018-04-22 06:33 GMT
ఏదైనా వివాదం చెలరేగి.. అందులో ఎవరైనా ఫిలిం సెలబ్రెటీలకు లేదా రాజకీయ నాయ కులకు నొప్పి కలిగిందంటే ముందు వాళ్ల టార్గెట్ మీడియానే అవుతుంది. తమ అసలు శత్రువుల్ని కూడా పక్కన పెట్టేసి మీడియా మీద రైజ్ అయిపోతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. శ్రీరెడ్డి ఇష్యూకు సంబంధించి పవన్ మీడియాపై ఎలా విరుచుకుపడుతున్నాడో తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో పవన్ కు మద్దతుగా మాట్లాడిన జీవిత సైతం ఇప్పుడు మీడియానే లక్ష్యంగా చేసుకున్నారు. మీడియా వాళ్లు నిజా నిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ప్రసారం చేసేస్తారని ఆమె మండి పడ్డారు.

కొన్ని రోజుల కిందట సామాజిక కార్యకర్త సంధ్య జీవిత-రాజశేఖర్ జంట మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పేదింటి అమ్మాయిల్ని లోబరుచుకుని తన భర్త దగ్గరికి జీవిత పంపేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆమె అన్న మాటలు యథాతథంగా మీడియాలో వచ్చాయి. ఐతే దీనికి సంబంధించిన వార్తల్ని ఆధారాల్లేకుండా ఎలా ప్రసారం చేస్తారని జీవిత ప్రశ్నించింది. ఏ విషయంలో అయినా తప్పు చేసిన వాళ్లు నేరం రుజువైతే శిక్ష అనుభవించకుండా పోరని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఐతే మీడియా వాళ్లు టీఆర్పీల కోసం ముందే తీర్పులిచ్చేస్తూ తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సమంజసం కాదని ఆమె అన్నారు. తమ అభిప్రాయాల్ని జనాల మీదికి రుద్దడం ఎంత వరకు న్యాయమని జీవిత ప్రశ్నించారు.
Tags:    

Similar News