#డైల‌మా.. థియేట‌ర్ లో బొమ్మ ప‌డేదెలా..!?

Update: 2021-09-05 09:30 GMT
క‌రోనా రంగ ప్ర‌వేశం జీవితాల్ని అల్ల‌క‌ల్లోలం చేసింది. థియేట‌ర్ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మైంది. సెకెండ్ వేవ్ ముగిసింది. థ‌ర్డ్ వేవ్ ఉంది అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఆ త‌ర్వాతా క‌రోనా ఇంకెన్ని వేవ్ ల‌తో దాడి చేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రో వైపు డ‌బ్యూ.హెచ్.ఓ ..ఐసీఎమ్.ఆర్ క‌రోనా రూపాంత‌రాల గురించి అప్ డేట్స్ ఇస్తూ మ‌రింత హెచ్చ‌రిస్తోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల విష‌యంలో అనిశ్చితి  కొన‌సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్లు ఓపెన్ అయినా బొమ్మ ప‌డ‌టం లేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు అన్ లాక్ అయి  రోజులు గ‌డుస్తోంది. సినిమా రిలీజ్ లు మాత్రం జ‌ర‌గ‌లేదు.  సినిమా పెద్ద‌దా?  చిన్న‌దా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ఆడియ‌న్స్ థియేట‌ర్ వైపు చూడ‌క‌పోవ‌డం అన్న‌దే ఇప్పుడు ఎన్నో ర‌కాల సందేహాల‌కు దారి తీస్తోంది.

ప్ర‌జ‌లు పార్కుల‌కు వెళ్తున్నారు..గుడులుగోపురాలు చుట్టేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు టూర్లు కొన‌సాగుతున్నాయి. ప‌బ్లిక్ ప్లేస్ ల్లో మాస్కులు లేకుండానే సంచ‌రిస్తున్నారు. కానీ సినిమా హాళ్ల‌కు మాత్రం రావ‌డం లేదు. అక్క‌డ రాని భ‌యం థియేట‌ర్లు! అంటే వామ్మో అంటున్నారు. కార‌ణం ఏదైనా థియేట్రిక‌ల్ రంగంలో క్రైసిస్ ని ముందే ఊహించిన ఇండ‌స్ట్రీ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ సురేష్ బాబు భ‌విష్య‌త్ సినిమా డిజిట‌ల్ మ‌యం అంటూ హెచ్చ‌రించారు. ఇదంతా చూస్తుంటే థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తికూలంగానే  క‌నిపిస్తుంది. ఏడాదిన్న‌ర కాలంగా ప్రేక్ష‌కుల వినోద‌మంతా ఓటీటీల‌తో ముడిప‌డిపోవ‌డం కూడా జీర్ణించుకోలేని విధంగా మారింది.

త‌క్కువ ఖ‌ర్చులోనే కుటుంబ‌మంతా స్టార్ హీరోల‌ సినిమాలు చేసేస్తున్నారు. పార్కింగ్.. పాప్ కార్న్.. కూల్ డ్రింక్  ఖ‌ర్చు కూడా లేదు. టైమ్ అయింది.. బ‌య‌ట‌ తిని వెళ్లాల‌న్నా! టెన్ష‌న్ లేదు. ఎంచక్కా సినిమా చూస్తూ ఆన్ లైన్ ఆర్డ‌ర్ లో ఫుడ్ ని ఇంటికే ర‌ప్పిస్తున్నారు. ఇంట్లోనే త‌క్కువ ఖ‌ర్చుతో  వినోదాన్ని ఆస్వాధిస్తున్నారు. ఆ ర‌కంగా జ‌నాల మైండ్ ఫిక్స్ చేసేశారు. మ‌రి తాజా ప‌రిస్థితులు.. భ‌విష్య‌త్ ఆలోచ‌న‌ల్ని బేరీజు వేసుకుని చూస్తే మ‌ళ్లీ పాత రోజులు వ‌స్తాయా రావా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌క్కువ ఖ‌ర్చులోనే క్వాలిటీలో ది బెస్ట్ ఇవ్వ‌డానికి ఓటీటీలు పోటీ ప‌డుతున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండ‌నే ఉంది. మ‌రి ఇన్ని ర‌కాల సౌక‌ర్యాల న‌డుమ థియేట‌ర్లు తెరుచుకున్నా! ఎగ‌బ‌డి టిక్కెట్ కొని సినిమా చూసేంత సాహ‌సం ఎవ‌రు చేస్తారు? అన్న సందేహం అలానే ఉంది. క‌రోనా రాక‌ ముందే చాలా థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాళ్లుగా మారిపోయాయి.  ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే థియేట‌ర్లో సినిమా క‌ష్ట‌మ‌ని భావించి ప‌లువురు టాలీవుడ్ నిర్మాత‌లు ముందుకొచ్చి వారే థియేట‌ర్ల‌ని లీజ్ కు తీసుకుని.. ఇంకా అవ‌స‌రం అనుకున్న వాళ్లు సొంతంగా కొనేసుకుని పెట్టుకున్నారు. మ‌రి తాజా ప‌రిస్థితిని మార్చాలంటే మ‌ళ్లీ నిర్మాత‌లే పూనుకుని థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఓటీటీ క్ర‌య‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడే మ‌ళ్లీ థియేట‌ర్ల‌కి పాత రోజులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.  లేదంటే థియేట‌ర్లో సినిమా అనేది అసాధ్య‌మే.

జ‌నంలో కాలంతో పాటే మార్పు!

అయితే భార‌త‌దేశంలో ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌రు! అన‌డానికి ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. ప‌రిస్థితులు మారి.. పూర్తి వ్యాక్సినేష‌న్ తో క‌రోనాను అదుపు చేయ‌గ‌లిగితే అప్పుడు మ‌ళ్లీ థియేట్రిక‌ల్ రంగానికి ఊపొస్తుంది. కానీ అప్ప‌టివ‌ర‌కూ ఓపిక ప‌ట్ట‌డం అవ‌స‌రం. ఇక ప్ర‌జ‌ల ఓటీటీ అల‌వాటు పొర‌పాటుగా మారితే ప‌ర్వాలేదు. కానీ హాబీగా మారితే మాత్ర‌మే క‌ష్టం. ఓటీటీలు ఇప్ప‌టికే ఇబ్బ‌డిముబ్బ‌డిగా బ‌రిలో ఉన్నాయి. కొత్త ఆఫ‌ర్ల‌తో కార్పోరేట్  కంపెనీలు ఓటీటీ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. దీనివ‌ల్ల ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారీ పాన్ ఇండియా సినిమాలు.. 3డి సినిమాల్ని మాత్ర‌మే థియేట‌ర్ల కోసం తీయాలేమో! అనే పరిస్థితి భ‌విష్య‌త్ లో ఉంటుందేమో!!
Tags:    

Similar News