హీరోయిన్ల మెడకు ఉచ్చు బిగించిన తలవెంట్రుకలు..!

Update: 2021-08-25 03:30 GMT
బాలీవుడ్‌ - శాండిల్‌ వుడ్‌ డ్రగ్‌ రాకెట్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ కేసులో ఎంతోమంది సెలబ్రిటీలు, సినీ నటీనటులు బయటకు వచ్చారు. గతేడాది లాక్ డౌన్ లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచీ పోలీసుల మెరుపు దాడులు - దర్యాప్తుతో కన్నడ చిత్ర సీమకు చుట్టుకుంది. అనేకమంది ప్రముఖులు నిషేధిత డ్రగ్ వాడుతున్నారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో హీరోయిన్లు సంజన గల్రానీ - రాగిణీ ద్వివేది పేర్లు తెర పైకి వచ్చాయి.

సంజన - రాగిణీ లకు డ్రగ్‌ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని.. తరచూ డ్రగ్‌ మాదకద్రవ్యాల వినియోగం - సరఫరా ఆరోపణలతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా వీరేన్ ఖాన్నా - కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా.. ఇంకా 20 మందికిపైగా సెలబ్రిటీలను ఈ కేసులో అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్ లకు.. బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు.

అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజన - రాగిణీ ల తలవెంట్రులను సేకరించిన బెంగుళూరు పోలీసులు.. గతేడాది అక్టోబర్ లో హైదరాబాద్ లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీకి (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపిన సంగతి తెలిసిందే. తాజాగా CFSL రిపోర్ట్‌ విడుదల అయింది. ఇందులో సంజన గల్రానీ - రాగిణి ద్వివేది డ్రగ్స్ వినియోగించారనే విషయం సేవించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ.. వారి నుంచి మూత్ర రక్త పరీక్షలనే కాకుండా డ్రగ్స్ వినియోగ నిర్దారణ పరీక్షల కోసం వెంట్రుకల శాంపిల్స్ కూడా తీసుకున్నామని.. 2020 అక్టోబర్‌ లో హైదరాబాద్‌ లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికీ పంపించామని తెలిపారు.

డ్రగ్స్ కేసును తల వెంట్రుకల ద్వారా దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి అని.. ఒకసారి డ్రగ్స్ తీసుకొంటే ఏడాది పాటు వెంట్రుకల్లో వాటి కణాలు నిక్షిప్తమై ఉంటాయని అధికారులు పేర్కొన్నట్లు కన్నడ మీడియా తెలిపింది. ఇక మాధకద్రవ్యాల కేసు దర్యాప్తు పట్ల బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్‌ లో పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని.. కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేశాంమని.. బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసును నిజాయితీగా, వేగంగా దర్యాప్తును పూర్తి చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తాజా CFSL రిపోర్ట్‌ లో కొంత మంది డ్రగ్స్ వినియోగించినట్టు స్పష్టమైందని.. మెడికల్ రిపోర్టుల ద్వారా వారిపై చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తామని కమల్ పంత్ అన్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రిపోర్టులను సేకరించామని.. కొందరు విదేశీయులను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు దర్యాప్తు సమాచారాన్ని లీక్ చేసిన అధికారులను సస్పెండ్ చేశామని.. ఇది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విజయమని కమల్ పంత్ పేర్కొన్నారు.

ఎఫ్ఎస్‌ఎల్‌ రిపోర్టులో డ్రగ్స్‌ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి - సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే మరోసారి హీరోయిన్ల మెడకు ఈ కేసు చుట్టుకొనే అవకాశం ఉంది. కాగా, 'బుజ్జిగాడు' 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సంజన నటించింది. అలానే 'జెండాపై కపిరాజు' సినిమాతో కన్నడ హీరోయిన్ రాగిణి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Tags:    

Similar News