బాలయ్య పునరాలోచనలో పడ్డాడా?

Update: 2016-02-10 11:30 GMT
నందమూరి బాలకృష్ణ కెరీర్లో 99 సినిమాలు పూర్తయిపోయాయి. 100వ సినిమా అనేది ఒక నంబర్ మాత్రమేనని.. దాన్ని ప్రత్యేకంగా ఏమీ చూడనని బాలయ్య అన్నాడు కానీ.. ఆ సినిమా మొదలుపెట్టడానికి మాత్రం సమయం తీసుకుంటున్నాడు. ‘డిక్టేటర్’ పూర్తి చేసి నెల దాటుతున్నా 100వ సినిమా గురించి ఇంకా ప్రకటన కూడా చేయలేదు బాలయ్య. ఈ సినిమా విషయంలో అభిమానుల ఆకాంక్షలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయడానికే మొగ్గు చూపాడు. సింగీతం జోరు తగ్గించేసి చాలా కాలమైన నేపథ్యంలో బాలయ్య కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాను ఆయన దర్శకత్వంలో చేయాలనుకోవడం పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.

బాలయ్య నుంచి సింహా - లెజెండ్ తరహా మాస్ మసాలా సినిమాను ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఐతే మొదట ఇదేమీ పట్టనట్లు ఉన్న బాలయ్యలో ఇప్పుడు పునరాలోచన మొదలవుతోందట. బాలయ్య అభిమానుల సంఘం నుంచి.. మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి‘ఆదిత్య 999’ విషయంలో బాలయ్య మనసు మార్చుకున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కాకపోవడానికి కూడా అదే కారణమట. ఆ సినిమాను పక్కనబెడితే.. బాలయ్యకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. ఆల్రెడీ బోయపాటి ఓ కథతో రెడీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి కూడా‘రామారావుగారు’ అనే కథ రెడీ చేశాడు. పరుచూరి రవీంద్ర కూడా ఓ స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మూడింట్లో బాలయ్య ఏది ఓకే చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News