నాలుగేళ్ల‌కు మ‌రో సినిమాకు మోక్షం!

ఏడుగురు వీర మరాఠా యోధుల సాహసగాథగా రూపొందుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా న‌టిస్తున్నారు.;

Update: 2026-04-29 07:13 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన చిత్రం `వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్`. 2022లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పీరియాడిక్ డ్రామా బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయిందని గతంలో ప్రచారం జరిగింది. అయితే అభిమానులను అలరించేలా సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఆగిపోలేదని సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైందని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు.

అక్ష‌య్ కుమార్ మరాఠీ చిత్ర పరిశ్రమలోకి ఈ సినిమాతోనే అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్ , ఇతర సాంకేతిక పనులపై దృష్టి సారించారు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రాబోతున్న సినిమాను 2027 జనవరి 1న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి 2023 దీపావళికి విడుదల కావాల్సిన సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పట్లో నిలిచిపోయింది. కానీ పట్టుదలని విక్రమార్కుడిలా దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు.

ఏడుగురు వీర మరాఠా యోధుల సాహసగాథగా రూపొందుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే పాత్ర‌కు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ‌త కొంత కాలంగా ప‌రాజ‌యాల్లో ఉన్న అక్ష‌య్ కుమార్ ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `భూత్ బంగ్లా` మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి ఓ చారిత్రక పాత్రలో అక్ష‌య్ కనిపించడం కెరీర్‌కు మ‌రింత క‌లిసొచ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ సినిమా మరాఠీతోపాటు, పాన్ ఇండియాలో పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.

చారిత్రక నేపథ్యంలో సాగే ఇలాంటి భారీ చిత్రాలు వినోదాన్ని అందించడమే కాదు. మన వీర యోధుల సాహసాలను నేటి తరానికి పరిచయం చేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ఐకానిక్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తుండటంతో బాలీవుడ్ , మరాఠీ చిత్ర పరిశ్రమల్లో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ , వీఎఫ్ఎక్స్ విషయంలో మహేష్ మంజ్రేకర్ ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నారు. షూటింగ్ దశలో ఎదురైన ఆటంకాలను అధిగమించి చివరకు పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోవడం చిత్ర యూనిట్ పట్టుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News