బ్లాక్ బస్టర్ సీక్వెల్ వాయిదా కారణం?
ఇటీవలి కాలంలో ఖాన్ లకు టైమ్ కలిసి రావడం లేదు. సల్మాన్-షారూక్- అమీర్ ఖాన్ వీరంతా అనుకున్నదానిని అనుకున్న విధంగా చేసి చూపించడంలో విఫలమవుతున్నారు.
ఇటీవలి కాలంలో ఖాన్ లకు టైమ్ కలిసి రావడం లేదు. సల్మాన్-షారూక్- అమీర్ ఖాన్ వీరంతా అనుకున్నదానిని అనుకున్న విధంగా చేసి చూపించడంలో విఫలమవుతున్నారు. ఆ ముగ్గురిలో అమీర్ ఖాన్ పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. అతడు ఒక సినిమాలో నటించి ఇప్పటికే నాలుగేళ్లయింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? అంటే..! పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
లాల్ సింగ్ చడ్డా ఏ కారణంతో డిజాస్టర్ అయినా కానీ, ఆ తర్వాత అమీర్ ఖాన్ తాను అనుకున్నది ఏదీ సరిగా చేయడంలో తడబడుతూనే ఉన్నారు. సితారే జమీన్ పార్ సీక్వెల్ తారే జమీన్ పార్ కి రివ్యూలు బావున్నా కలెక్షన్లు సరిగా రాకపోవడం నిరాశపరిచింది. ఇలాంటి సమయంలోనే అతడు తన బ్లాక్ బస్టర్ హిట్ 3 ఇడియట్ సీక్వెల్ తీస్తున్నాడని కథనాలొచ్చాయి. కానీ ఈ సినిమాని టేకప్ చేయడానికి అతడు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.
అయితే ఇది మరోసారి వాయిదా పడిందని వినాల్సి వస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్పై ఎట్టకేలకు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్బస్టర్ చిత్రం `3 ఇడియట్స్` సీక్వెల్ పై అతడు పని చేస్తాడని చాలా కాలంగా ప్రచారం ఉన్నా.. ఇప్పుడు దానిని పక్కనపెట్టి ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చారిత్రాత్మక 1952 భారత్-పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ నేపథ్యంతో సాగే ఈ బయోపిక్ చిత్రం కోసం ఆమిర్ తన డేట్స్ను కేటాయించారు. దీనివల్ల రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో రావాల్సిన `3 ఇడియట్స్` సీక్వెల్ మరింత ఆలస్యం కానుంది. ఈ సీక్వెల్ షూటింగ్ కేవలం 2027 మధ్యకాలంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆమిర్ ఖాన్ `3 ఇడియట్స్` సీక్వెల్ కంటే ముందే ఈ క్రికెట్ డ్రామాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం కథ వంద శాతం సంతృప్తిగా ఉండటమేనని తెలుస్తోంది. ప్రముఖ భారతీయ క్రికెట్ దిగ్గజం లాలా అమర్నాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పూర్తి స్థాయి ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. స్క్రిప్ట్ పరంగా అన్ని పనులు పూర్తికావడంతో చిత్ర బృందం నటీనటుల ఎంపిక.. లొకేషన్ల సెర్చ్ను వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ను 2026 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాతలు యోచిస్తున్నారు.
ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆమిర్ ఖాన్తో పాటు మరో బహుముఖ ప్రజ్ఞాశాలి ఫర్హాన్ అక్తర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడిగానే కాకుండా.. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రితేష్ సిధ్వానీతో కలిసి ఫర్హాన్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. లాలా అమర్నాథ్ పాత్రను పోషిస్తున్న ఆమిర్ ఖాన్కు నలుగురు అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకరిగా ఫర్హాన్ అక్తర్ నటించనున్నారు. వెండితెరపై క్రికెట్ మ్యాచ్లను అత్యంత సహజంగా.. ప్రామాణికంగా ప్రతిబింబించడం కోసం.. ఈ ఇద్దరు అగ్ర నటులు షూటింగ్ ప్రారంభానికి ముందే కఠినమైన క్రికెట్ కోచింగ్ సెషన్లలో పాల్గొనవలసి ఉంటుంది.
మరోవైపు `3 ఇడియట్స్` సీక్వెల్ వాయిదా పడటానికి కథనం (స్క్రీన్ప్లే)పై ఆమిర్ ఖాన్ అసంతృప్తిగా ఉండటమే ప్రధాన కారణమని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్కుమార్ హిరాణీ- రచయిత అభిజత్ జోషి ఒక మూల కథను ఖరారు చేసినా ఆమిర్ ఆశించిన స్థాయిలో సంభాషణలు, స్క్రీన్ప్లే ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు స్క్రిప్ట్ మార్పులు చేసినా ఆమిర్ పూర్తి సంతృప్తి చెందకపోవడంతో మరో రీరైట్కు ఆదేశించారు. అటు హిరాణీ.. ఇటు ఆమిర్ ఇద్దరూ కూడా ప్రేక్షకుల భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అరకొర కథతో సినిమాను తొందరపడి పట్టాలెక్కించడం కంటే స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయ్యే వరకు వేచి చూడటమే మంచిదని భావించారు. ఈ లోగా లాలా అమర్నాథ్ బయోపిక్కు రాజ్కుమార్ హిరాణీ కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ ఆమిర్కు మద్దతుగా నిలుస్తున్నారు.