మంచి సినిమాలు కావాలంటారు.. వస్తే ఇలా..!
ఇటీవల పరిస్థితల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ సోషల్ మీడియా ద్వారా తన అసహనంను వ్యక్తం చేసింది.;
ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా సక్సెస్ రేటు అత్యంత తక్కువగా ఉంటుంది. ఎంత గొప్ప సినిమాలు తీసినా, ఎంత మంచి సినిమాలు తీశాం అని చెప్పుకుంటున్నా కేవలం 10 నుంచి 20 శాతం సినిమాలు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఎంతో మంది దర్శకులు గొప్ప సినిమాలు తీసి, గొప్ప విజయాలు అందుకున్నారు. కానీ వారు ఇప్పుడు తీస్తున్న సినిమాలతో మినిమం హిట్ను అందుకోలేక పోతున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాల మేకింగ్ ఉండటం లేదు అంటూ కొందరు అంటే, కొందరు మాత్రం ప్రేక్షకుల తీరు సరిగా లేదు అంటున్నారు. మంచి సినిమా కావాలని అంటారు, మంచి సినిమా తీసినప్పుడు పెద్దగా పట్టించుకోరు, మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలని తీసిన ప్రతిసారి విఫలం అవుతున్నామని కొందరు మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.
అనురాగ్ కశ్యప్ మూవీ..
బాలీవుడ్కి చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గతంలో చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి, విమర్శకులు ప్రశంసలు దక్కించుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన ఒకానొక సమయంలో తాను సినిమాలను వదిలేస్తాను అంటూ అసహనం వ్యక్తం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, గుర్తింపు, గౌరవం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అనురాగ్ కశ్యప్ కి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన నిశాంచి సినిమా తీవ్రంగా నిరాశ పరచిన విషయం తెల్సిందే. కమర్షియల్గా సినిమాకు మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అయినా కూడా పెద్దగా ఆడలేదు. దాంతో అనురాగ్ కశ్యప్ సైతం తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేశాడు.
ఆలియా కశ్యప్ ఆగ్రహం
ఇటీవల పరిస్థితల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ సోషల్ మీడియా ద్వారా తన అసహనంను వ్యక్తం చేసింది. ఆమె ఇన్స్టా స్టోరీలో... ప్రేక్షకులు ఎప్పుడూ మాకు మంచి సినిమాలు కావాలి అని అడుగుతూ ఉంటారు. కానీ మంచి సినిమాలను మేకర్స్ తీసి, థియేటర్లలో విడుదల చేసినప్పుడు మాత్రం వెళ్లి చూడరు. కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని కల్ట్ సినిమాలు అని, గొప్ప క్లాసిక్ సినిమాలు అంటూ రీ రిలీజ్ చేయడం లేదా వాటి గురించి మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. విడుదల అయిన సమయంలోనే ఆ సినిమాలను థియేటర్లకు వెళ్లి చేస్తే అలాంటి సినిమాలు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేసింది.
బాలీవుడ్తో పాటు అన్ని భాషల్లోనూ..
తన తండ్రి అనురాగ్ కశ్యప్ చాలా కష్టపడి నిషాంచి సినిమాను తీశారు. ఆయన సినిమా కి వచ్చిన స్పందన చూసి చాలా నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆ సినిమా ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయితే చూడటం కంటే ఇప్పుడు చూడాలి అంటూ ఆమె సూచించింది. ఇలా మంచి సినిమాలను తిరస్కరించడం ఇప్పుడు కొత్తగా వస్తున్నది కాదని, చాలా ఏళ్లుగా ఇలాగే జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్గా ప్రశంసలు దక్కించుకున్నాయి. కానీ ఇండియాలో మినిమం వసూళ్లు రాని సినిమాలు చాలానే ఉన్నాయి. ఫిల్మ్ మేకర్స్ రిస్క్ తీసుకుని, కష్టపడి సినిమాలు చేయడం వల్ల ఫలితం ఏం ఉందని అనుకుంటున్నారు. ముందు ముందు అయినా మంచి సినిమాలకు ఆధరణ ఉండాలని, థియేటర్లకు జనాలు రావాలని ఆమె కోరుతోంది. థియేటర్లో సినిమాలు ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత ఎప్పుడో సపోర్ట్ చేస్తాం అంటే ఎలా అని ఆమె ప్రశ్నించింది.