సన్.. ధనాధన్.. ప్లేఆఫ్స్ క్వాలిఫైకి భలే చాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశ దాదాపు ముగింపునకు వచ్చింది. 70 మ్యాచ్ ల ఈ దశ తర్వాత ప్లే ఆఫ్స్ జరగనున్నాయి.

Update: 2024-05-10 11:53 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశ దాదాపు ముగింపునకు వచ్చింది. 70 మ్యాచ్ ల ఈ దశ తర్వాత ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. మార్చి 22న మొదలైన ఐపీఎల్-17కు మే 26న జరిగే ఫైనల్ తో శుభం కార్డు పడనుంది. ఒక్కో జట్టు 14 లీగ్ మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇప్పటివరకు చూస్తే పది జట్లకు గాను నాలుగు జట్లు 11 మ్యాచ్ లు ఆడాయి. ఆరు జట్లు 12 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. తొలి నుంచి అద్భుతంగా ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ లలో 8 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాయి. ఇప్పటివరకు చెన్నై, గుజరాత్ మాత్రమే వీటితో సమానంగా 11 మ్యాచ్ లు ఆడాయి. శుక్రవారం ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. అయితే, పాయింట్ల పట్టికలో చెన్నై నాలుగో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి ఏడింటిలో గెలిచింది. బుధవారం సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ను చితక్కొట్టి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. రన్ రేట్ ప్రకారం చెన్నై (0.700) కంటే సన్ రైజర్స్ (0.406) వెనుకనే ఉంది. కానీ, 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒకవేళ గుజరాత్ పై చెన్నై గెలిస్తే సన్ రైజర్స్ నాలుగో ప్లేస్ కు దిగుతుంది.

సొంతగడ్డపై చెలరేగి..

ఈ సీజన్ లో రికార్డు స్కోర్లు చేస్తున్న సన్ రైజర్స్ (ఉప్పల్ లో ముంబై పై 277), బెంగళూరులో బెంగళూరుపై (287) చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నోపై అయితే 58 బంతుల్లోనే 166 పరుగుల లక్ష్యాన్ని కొట్టేసింది. దీంతో రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉంది. కాగా, హైదరాబాద్ విజయాల్లో అత్యధికం సొంతగడ్డపై సాధించనవే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ ముంగిట సన్ రైజర్స్ కు మంచి చాన్స్ లభించింది.

రెండూ ఇక్కడే.. బలహీన జట్లపై

Read more!

7 మ్యాచ్ లలో గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ మిగతా రెండు మ్యాచ్ లను ఉప్పల్ లోనే ఆడనుంది. ఈ నెల 16న గుజరాత్ టైటాన్స్ తో, 19న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ప్రస్తుత లీగ్ లో గుజరాత్, పంజాబ్ కాస్త బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్ ను ఈ రెండూ నిలువరించడం కష్టమే. ఈ నేపథ్యంలోనే రెండు మ్యాచ్ లలోనూ గెలిచేందుకు సన్ రైజర్స్ కు మంచి చాన్స్ దక్కింది. తద్వారా 18 పాయింట్లతో మిగతా జట్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశం దక్కనుంది. మొత్తానికి సన్ రైజర్స్ నక్క తోక తొక్కిందనే అనుకోవాలి.

కొసమెరుపు: గుజరాత్, పంజాబ్ బలహీనంగా ఉన్నా.. ముంబై, బెంగళూరులా మాత్రం తీసిపడయలేం. కాబట్టి సన్ రైజర్స్ కాస్త జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుంది. లేదంటే.. 14 పాయింట్లకు పరిమితమై మిగతా జట్ల ఫలితాల కోసం చూడాల్సి వస్తుంది.

Tags:    

Similar News