బాయ్ కాట్ పాక్ ది.. భారీ డబ్బు లాస్ ఐసీసీకి.. వేటు తప్పదిక
క్రీడల్లో రాజకీయాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ మాట చాలా పవర్ ఫుల్. చాలా క్రీడా సమాఖ్యలు, బోర్డులు ఈ విషయంలో సీరియస్ నిర్ణయాలు తీసుకుంటాయి.;
క్రీడల్లో రాజకీయాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ మాట చాలా పవర్ ఫుల్. చాలా క్రీడా సమాఖ్యలు, బోర్డులు ఈ విషయంలో సీరియస్ నిర్ణయాలు తీసుకుంటాయి. ఏదేనా దేశంలో క్రీడల్లో రాజకీయాలు చోటుచేసుకున్నట్లు తెలిస్తే వెంటనే ఆ దేశంపై నిషేధం విధిస్తాయి. తద్వారా ఆ దేశ జట్టు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్ తో మ్యాచ్ ఆడకూడదని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించడం కూడా ఈ కోవలోకే వస్తుంది. మరి.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుంది..? పాకిస్థాన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఐసీసీకి భారీ లాస్ తెస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పిస్తుందా? అనే చర్చ మొదలైంది.
మ్యాచ్ అంటే మ్యాచ్ మాత్రమే కాదు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంటే.. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్, అడ్వర్టయిజ్ మెంట్స్, స్పాన్సర్ షిప్, టికెట్లు అమ్మకం.. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు పాకిస్థాన్ బాయ్ కాట్ చేయడంతో ఇవన్నీ కోల్పోయినట్లే. ఈ మొత్తం విలువ రూ.2200 కోట్లు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారత్, పాకిస్థాన్ బోర్డులకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లుతుందని లెక్కలేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయిల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఉన్న బీసీసీఐకి ఇది చిల్లర. కానీ, పాకిస్థాన్ కు మాత్రం భారీ మొత్తమే.
బ్రాండ్ దెబ్బతింటుంది..
భారత్ -పాక్ మ్యాచ్ అంటే అందులోనూ ప్రపంచకప్ లో అంటే మామూలు కాదు. బ్రాడ్ కాస్టర్ జియో స్టార్ రూ.200-250 కోట్లు నష్టపోనుంది. మ్యాచ్ లో పది సెకన్ల స్లాట్ విలువే రూ.40 లక్షలు. దీంతోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఐసీసీ భారీ ఫైన్ వేసే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. పీసీబీ ఏటా ఆదాయమే రూ.300 కోట్లు. దీంతోపాటు వచ్చే ఏడాది వరకు భారత్ తో మ్యాచ్ లను తటస్థ వేదికపై ఆడేందుకు ఒప్పుకొంది. దీనిని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా తప్పదు.
మరి నాకౌట్లో తలపడాల్సి వస్తే..
భారత్ తో ఈ నెల 15న ఆదివారం కొలంబోలో లీగ్ మ్యాచ్ ను ఆడం అని పాక్ అంటోంది. ఈ నిర్ణయాన్ని మళ్లీ మార్చుకునేందుకు వీలుంది. అయితే, అది తొందరగా జరగాలి. మరి నాలుగు రోజుల సమయం కూడా లేదు. కానీ, నాకౌట్ లో భారత్ ఎదురైతే ఏం చేస్తుంది? అనేది ప్రశ్న. దీనికి సమాధానం.. తమ ప్రభుత్వ నిర్ణయం అని పాక్ క్రికెట్ బోర్డు అంటోంది. ఒకవేళ నాకౌట్ లోనూ పాక్ ఆడకుంటే.. ప్రపంచకప్ నుంచి ఔట్ అవుతుంది. అప్పుడు ఐసీసీ మరిన్ని చర్యలకు సిద్ధం అయినా ఆశ్చర్యం లేదు.